వైసిపి అధినేత జగన్ బెయిల్ త్వరలో రద్దు కాబోతోందని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన స్థానంలో వైయస్ భారతి సీఎంగా బాధ్యతలు చేపడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.పల్లె నుంచి పట్నం వరకు ఇదే విషయంపై జనాలు చర్చించుకుంటున్నారు.
ఈ తరహా ప్రచారం మరీ ఎక్కువ అవడానికి కారణం ఇటీవల జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరడం, కోర్టు దానికి అంగీకరించకపోవడంతో ఈ తరహా ప్రచారం మరింత ఎక్కువైంది.జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉండడంతో కేసు విచారణను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ తన వాదనలు వినిపించింది.
దీనికితోడు తీవ్రమైన కేసులలో ఉన్నవారు సుదీర్ఘకాలం బెయిల్ పై బయట ఉండడం సరైంది కాదని, కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు అయ్యి, మళ్ళీ జైలు పాలవుతారని కొంతమంది పనిగట్టుకొని ప్రచారం మొదలుపెట్టారు.
కొద్ది రోజుల క్రితం జగన్ తన సతీమణి భారతితో కలిసి గవర్నర్ ను కలవడంతో ఈ తరహా ప్రచారానికి మరింత బలం చేకూరింది.
భారతికి రాజకీయం పరిపాలన గురించి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.తన సతీమణి సీఎం చేయాల్సిందిగా గవర్నర్ ను జగన్ కోరినట్టుగా టిడిపి ప్రచారం చేసింది.
ఇక టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా జగన్ బెయిల్ రద్దు అయ్యిందని జగన్ జైలుకు వెల్లడ ఖాయం అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రచారం మొదలుపెట్టారు.
ప్రస్తుతం టీడీపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.చంద్రబాబు పార్టీని మళ్లీ ప్రజల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా వైసీపీ వ్యూహంతో వరుసగా టీడీపీ నేతలు బయటకు వెళ్లిపోతున్నారు.పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వలసలు వెళ్లకుండా చూసుకోవడం టీడీపీకి అత్యవసరం.
అందుకే టీడీపీ భవిష్యత్పై నమ్మకం కలిగించడం కంటే వైసీపీ భవిష్యత్పై అపనమ్మకం కల్పించాలని చంద్రబాబు భావించే ఈ విధమైన ప్రచారానికి తెర లేపినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే జగన్ మళ్లీ జైలుకు వెళతారనే ప్రచారం తెలుగుదేశం వర్గాల నుంచే మొదలైంది.
జగన్ జైలుకు వెళ్తే వైసీపీకి భవిష్యత్ ఉండదని నాయకులకు తెలియచెప్పడం ద్వారా వలసలు ఆగుతాయని బాబు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.