మంత్రివర్గ ఏర్పాటు జగన్ కు పెద్ద సవాల్ గా మారే అవకాశం కనిపిస్తోంది.వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉంటూ వచ్చిన వారు ఇప్పుడు తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందనే ఆలోచనతో ఉన్నారు.
అయితే జగన్ మాత్రం సామజిక సమీకరణాల లెక్కలు చూసుకుని మరీ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు చూస్తున్నాడు.అందులోనూ మొదటి నుంచి తనకు వీర విధేయులుగా ఉన్న వారికే జగన్ పట్టం కట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జగన్ ఇదే లెక్కన మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నారు.అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో మంత్రులుగా ఉన్నవారు కొంతమంది ఇప్పుడు జగన్ పార్టీలో కీలకంగా మారడంతో వారికి కూడా తప్పనిసరిగా మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఆ రేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్య నారాయణ వంటి వారు ఉన్నారు.అలాగే ఇంకా మంత్రి పదవులు ఆశించే వారి లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే.
శ్రీకాకుళం జిల్లా నుంచి కంబాల జోగులు (రాజాం-ఎస్సీ), తమ్మినేని సీతారాం (ఆమదాలవలస–బీసీ), ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం)/ ధర్మాన కృష్ణదాసు (నరసన్నపేట-బీసీ), కళావతి (పాలకొండ-ఎస్టీ); విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి–బీసీ), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం- ఓసీ-వైశ్య), పుష్పశ్రీవాణి (కురుపాం-ఎస్టీ); విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాస్ (భీమిలి-కాపు), కరణం ధర్మశ్రీ (చోడవరం-కాపు), గుడివాడ అమరనాథ్(అనకాపల్లి-కాపు), ముత్యాల నాయుడు (మాడుగుల-బీసీ); తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ), పినిపె విశ్వరూప్ (అమలాపురం-ఎస్సీ), దాడిశెట్టి రాజా (తుని-కాపు); పశ్చిమగోదావరి జిల్లా ప్రసాదరాజు (నరసాపురం-క్షత్రియ), గ్రంథి శ్రీనివాస్ (భీమవరం-కాపు); కృష్ణా జిల్లా కొడాలి వెంకటేశ్వరరావు-నాని) (గుడివాడ-కమ్మ), కొలుసు పార్థసారథి (పెనమలూరు-బీసీ), పేర్ని నాని (బందరు-కాపు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట-కాపు); గుంటూరు జిల్లాలో మేకపాటి సుచరిత (ప్రత్తిపాడు-ఎస్సీ), మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ ఇస్తారు- కమ్మ), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి-రెడ్డి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి-కాపు), ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు- రెడ్డి), ఆదిమూలపు సురేశ్ (యర్రగొండపాలెం-ఎస్సీ).
నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు-రెడ్డి), కాకాణి గోవర్ధన్రెడ్డి (సర్వేపల్లి-రెడ్డి), అనిల్కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ-బీసీ), చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-రెడ్డి), ఆర్.కె.రోజా (నగరి-రెడ్డి), కడప జిల్లాలో అంజాద్ బాషా (కడప- ముస్లిం), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు-ఎస్సీ), అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్-రెడ్డి), శంకరనారాయణ (పెనుకొండ-బీసీ), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం-బీసీ), కర్నూలు జిల్లాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-రెడ్డి), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం-రెడ్డి) తదితరులను జగన్ పరిశీలనలో తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఇందులో ఎంతమందికి అవకాశం దక్కబోతోంది అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.