టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కాస్త సైలెంట్ గానే ఉంటున్నట్టు కనిపిస్తున్నా, ఆయన తనయుడు నారా లోకేష్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వంపై తరచుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు.గతం కంటే లోకేష్ దూకుడు ఎక్కువగా ఉన్నట్టు గా వైసిపి అంచనా వేస్తోంది.
భవిష్యత్తులో టిడిపి పగ్గాలు లోకేష్ చేతుల్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయపడుతోంది.పార్టీ నాయకుల్లో భరోసా కల్పించే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ హడావుడి చేస్తున్నారనే అభిప్రాయం అధికార పార్టీ వైసీపీలో నెలకొంది.
అలాగే అనేక అవినీతి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూ, జైలు పాలైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల విషయంలోనూ లోకేష్ వారికి మద్దతుగా ఉంటూ పరామర్శ పేరుతో పార్టీలో జోష్ నింపుతూ హడావుడి చేస్తున్నారు.అలాగే ఎమ్మెల్సీ గా కూడా ఉండడంతో మండలిలో అడుగడుగున ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డం పడుతూ, పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి మండలిలోనూ మెజారిటీ ఉండడంతో, అక్కడ లోకేష్ దూకుడు ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం అధికార పార్టీలో ఉంది.ఈ నేపథ్యంలోనే లోకేష్ కు చెక్ పెట్టాలనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి ఎమ్మెల్సీ పదవి ఊడగొట్టలని వైసిపి అన్నిరకాలుగా ప్లాన్ చేసుకుంటోంది.అందుకే గతంలో తెలుగుదేశం పార్టీ తమపై ప్రయోగించిన ఎథిక్స్ కమిటీని ఇప్పుడు వైసీపీ బయటకు తీస్తోంది.దీని కోసం అవసరమైన సాక్ష్యాలను కూడా సేకరించినట్లు సమాచారం.శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోకేష్ వ్యవహరించిన తీరును ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపెట్టి, అనర్హత వేటు వేయాలని చూస్తోంది.
శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులకు మధ్య వివాదం ఏర్పడిన సమయంలో లోకేష్ తన ఫోన్ లో ఫోటోలు , వీడియోలు తీస్తూ కనిపించారు.
ఈ వ్యవహారం అప్పట్లో మీడియాలో వైరల్ అయింది.
అయితే మండలి లో ఫోటోలు, వీడియోలు తీయడం నియమ నిబంధనలు ఉల్లంఘించడం కిందే వస్తుంది.ఇదే అంశంపై ఎథిక్స్ కమిటీ కి ఫిర్యాదు చేసి లోకేష్ పై అనర్హత వేటు వేయించాలనే దిశగా వైసిపి ప్లాన్ చేసుకుంటోంది.
లోకేష్ ఎమ్మెల్సీ పదవి రద్దయితే మండల లో టిడిపి దూకుడుకు బ్రేక్ పడుతుందని, అలాగే ఆయనకు ఏ పదవి లేకుండా చేసినట్లు అవుతుందనే అభిప్రాయంలో జగన్ ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.