ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యను అమలు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.పీపీ-1, పీపీ-2గా ప్రైమరీ విద్యను అమలు చేయాలని ఆదేశించారు.సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు సహా నాణ్యమైన విద్య కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ చర్చించారు.మరోవైపు మానవ వనరుల సమర్థ వినియోగం, ఉత్తమమైన బోధన తదితర అంశాలపై చర్చ కొనసాగింది.
ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు కొత్త సిలబస్ ను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.రాష్ట్రంలో 55వేల అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయని.వాటిలో దాదాపు 35వేల కేంద్రాలకు భవనాలు లేవని సీఎం జగన్ తెలిపారు.ప్రైమరీ స్కూళ్లకు సమీపంలో అంగన్ వాడీలు ఉండాలంటే ఆయా స్కూళ్లలో తగిన స్థలాలను పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్రూమ్స్ పరిశుభ్రత చాలా ముఖ్యమైనవని సీఎం జగన్ తెలిపారు.మధ్యాహ్న భోజనంపై ఏమైనా ఫిర్యాదులు రాగానే వెంటనే స్పందిస్తున్నారా లేదా అనే దానిపై పర్యవేక్షించాలని చెప్పారు.
స్కూళ్లు తెరిచే సమయానికి మధ్యాహ్న భోజనంపై రూపొందించుకునన్న స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసిజర్ పాటించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.