ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రి మండలి ఏర్పాటుపై సీరియస్ గానే దృష్టిసారించారు.ఇప్పటికే ఏ జిల్లా నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంలో జగన్ పక్కా క్లారిటీతో ఉన్నాడు.
ఇక గెలిచిన వారిలో మంత్రి పదవులు ఆశించేవారు సంఖ్య కూడా భారీగానే ఉంది.మొదటి నుంచి జగన్ వెన్నంటే నడిచినవారు, సీనియర్ రాజకీయ నాయకులు ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవి తమకు తప్పకుండా వస్తుంది అని గట్టి నమ్మకం పెట్టుకున్నవారు సుమారు 50 మంది వరకు ఉన్నారు.
అయితే వారందరికీ స్థానం దక్కడం జరగని పని.ఎందుకంటే 25 మందితో మంత్రి వర్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలు ఉన్నా మొదటి విడతలో 13 లేదా 15 మందికి మాత్రమే అవకాశం ఇవ్వాలని జగన్ ఆలోచన చేస్తున్నాడు.
మంత్రివర్గ ఏర్పాటు తరువాత అవకాశం దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేయకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు.ఈ నెల 8 తేదీన ఏపీ కొత్త మంత్రుల ప్రకటనతో పాటు ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య సచివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది.దీనికోసం అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.13 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా మంత్రి వర్గం ఏర్పాటు చేయబోతున్నారు జగన్.అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఉండేలా సమీకరణాలు లెక్కలు వేసుకుని మరీ కాబోయే మంత్రుల జాబితా సిద్ధం చేశారు.
అయితే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కంటే ఒక్కరోజు ముందు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారట.
దీనికి ఈ నెల 7 వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో వైసీపీ శాసనసభ పక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేసారు.ఈ మీటింగ్ లోనే మంత్రివర్గ ఏర్పాటుపై జగన్ ప్రకటన చేయబోతున్నాడు.ఇంచుమించుగా ఎవరికి స్థానం దక్కబోతోంది అనే విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
తాను ఎవరికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందో క్లారిటీ ఇచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడట.ఇలా చేయడం ద్వారా మంత్రి పదవి ఆశించేవారు ఆ తరువాత ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయరని జగన్ అంచనా వేస్తున్నాడు.
అయితే ఆ అంచనా ఎంతవరకు కరెక్ట్ అవుతుందో 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.