ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు లో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభం చేయబోతున్నారు.ఈ విమానాశ్రయానికి కేంద్రం అన్ని అనుమతులు ఇవ్వటంతో పనులు వేగంగా పూర్తి చేయటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవ మరువలేనిది అని జిల్లా నాయకులు చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సీఎం జగన్ విమానాశ్రయానికి చేరుకుని తొలుత జాతీయ జెండాను ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
సరిగ్గా 12 గంటల 18 నిమిషాలకు విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
దీంతో రాయలసీమ ప్రాంతంలోమూడు విమానాశ్రయాలు వచ్చినట్లు అవుతుంది.ఇప్పటికే కడప, రేణిగుంట ప్రాంతాలలో విమానాశ్రయాలు ఉండటంతో తాజాగా కర్నూలు ఓర్వకల్లు లో కూడా విమానాశ్రయం ప్రారంభం కావటంతో మొత్తం మూడు విమానాశ్రయాలు రాయలసీమలో నెలకొన్నట్లు తెలుస్తోంది.
కరువు కాటకాలతో, వలసలతో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలలో ఒకటైన కర్నూలులో విమానాశ్రయం రావటం పట్ల ఆ ప్రాంత వాసులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.