‘పప్పు’ వాడకం ఈమధ్య ఏపీ రాజకీయాల్లో బాగా పెరిగిపోయింది.పప్పు అంటే తినే పప్పు కాదు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఉద్దేశించి ఆయన ప్రత్యర్థులు ఇదే పదం ఉపయోగిస్తూ తరచుగా ఆయనను అవమానాలకు గురి చేస్తున్నారు.
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు పేరుతో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలోనూ ఇదే పేరుతో ఏకంగా ఒక పాటను కూడా పెట్టేసారు.ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సభలోనూ లోకేష్ ను ఉద్దేశించి చంద్రబాబు ఎదురుగానే పప్పు అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన పేరును పదేపదే వాడేస్తున్నారు.
దీనిపై ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు.నన్ను పదే పదే పప్పు అంటూ విమర్శిస్తున్నారని, మరి ఇంగ్లీష్ సరిగా రాని, లెక్కలు సరిగా చేయలేని సీఎం జగన్ గన్నేరు పప్పు ఏ కదా అంటూ లోకేష్ విమర్శించారు.
తాను శాసనసభలో సభ్యుడిని కాకపోయినా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తన పేరును ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.సభలో లేని వ్యక్తి గురించి పదే పదే ప్రస్తావించినా స్పీకర్ వారిని ఏమాత్రం అడ్డుకోవడం లేదని ఇది మంచి పద్ధతి కాదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను తప్పుగా మాట్లాడడం ద్వారా ఏపీకి ఏదైనా అన్యాయం జరిగిందా అంటూ వైసీపీ నాయకులను ఉద్దేశించి లోకేష్ ప్రశ్నించారు.