కేంద్ర అధికార పార్టీ బీజేపీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ మధ్య రాజకీయ స్నేహం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎన్నికల ముందు నుంచి జగన్ అండ్ కో బృందం బీజేపీ నాయకులతో టచ్ లో ఉంటూ వచ్చారు.
ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా జగన్ కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించింది.ఇప్పుడు కూడా బీజేపీతో స్నేహం కొనసాగుతుందని వైసీపీ ప్రకటించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఏపీలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉన్నట్లే కనిపిస్తున్నా, లోపాయికారిగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.
సమాఖ్య దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వెళ్తేనే పాలన సాఫీగా, అభివృద్ధి దిశగా సాగుతుంది.
రాష్ట్ర అవసరాలు, నిధుల సమీకరణాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు జగన్.
అనవసరంగా కేంద్రంతో తగవు పెట్టుకుని ఇబ్బంది పడేకంటే, స్నేహంగా ఉంటేనే అన్నివిధాలుగా కలిసి వస్తుంది అనేది జగన్ వాదన.కాకపోతే ఏపీలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిన తర్వాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందట.
నలుగురు ఎంపీల చేరికతో ఏపీలో తమ బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీ ఇకపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.అయితే పార్టీలో చేరిన నలుగురు ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా జనంలో పట్టున్న వారు కాకపోవడం, కేవలం రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే పార్టీ మారారని జనం భావించడం అవమానం కింద బీజేపీ భావిస్తోంది.
అందుకే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎంఎల్ఏలను పార్టీలో చేర్చుకోడానికి బీజేపీ కంగారు పడుతోంది.
టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్యెల్యేల్లో సుమారు 15 మంది మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.ఇదే కనుక జరిగితే అటు బీజేపీకి, ఇటు జగన్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే, టీడీపీ ఎంఎల్ఏలు బీజేపీలో చేరితో వారు విలీనం అయ్యారో, ఫిరాయించారో తేల్చాల్సింది స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఇప్పటికే పార్టీ మారే ఎంఎల్ఏలను అనర్హులుగా ప్రకటించే విషయం మీద స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.అంటే టీడీపీ ఎంఎల్ఏల చేరికను విలీనం కింద తమ్మినేని పరిగణిస్తే వైసీపీకి ఇబ్బంది, అలా కాకుండా ఫిరాయింపు కింద, పార్టీ మారిన ఎంఎల్ఏలను స్పీకర్ తమ్మినేని అనర్హులుగా ప్రకటిస్తే బీజేపీకి ఇబ్బంది తప్పదు.
అప్పుడు బీజేపీ వైసీపీ మధ్య వైరం స్టార్ట్ అయినట్టే.