విదేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయుల కోసం భారత ప్రభుత్వం లేదా ఆయా వారి వారి ప్రాంత స్థానిక ప్రభుత్వాలు భీమా సౌకర్యాలను అందిస్తుంటాయి.ఎందుకంటే పొట్ట కూటి కోసం విదేశాలు వెళ్లి అక్కడ సంపాదించే సొమ్ము వారి జీవన ఆధారానికే సరిపోతుంది కానీ వారికి ఎలాంటి అపాయం కలిగినా, ప్రమాద వశాత్తు మృతి చెందినా ఆర్ధికంగా వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితి కూడా ఉండదు.దాంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
ఈ క్రమంలోనే వారు ఇబ్బందులు పడకుండా పలు రకాల పాలసీలను అందిస్తుంది ప్రభుత్వం.ఈ కోవలోనే
ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచీ విదేశాలకు వలసలు వెళ్ళిన వారికి అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద భీమా సౌకర్యాన్ని అందిస్తోంది.
ఈ మేరకు ఏపీఎన్ఆర్టీ (ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్ కీలక ప్రకటన చేశారు.అతి తక్కువ ఖర్చుతో తాము ఏపీ ఎన్నారైలు అందరికి ప్రమాద భీమా సౌకర్యాన్ని కలిగిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రవాస భారతీయులు ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అయితే ఈ భీమాను రెండు కేటగిరీలుగా విభజించారు.ఉద్యోగం చేసుకునే వారికి ప్రీమియం ఒకటి ఉంటే, చదువుకోవడానికి వెళ్ళిన వారికి ప్రీమియం తక్కువ ఉంటుందని తెలిపారు.
ఉద్యోగాలు చేసుకునేవారు ఏడాదికి రూ.550 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద భీమా పాలసీతో పాటుగా, వారికి ఏదన్నా జరిగితే చికిత్స కోసం లక్ష రూపాయలు చెల్లిస్తామని తెలిపారు.ఒక వేళ మరణిస్తే వారి మృత దేహాలను తీసుకురావడానికి అయ్యే విమాన ఖర్చులు భరిస్తామని, అంతేకాదు ప్రసవ ఖర్చుల క్రింద రూ.50 వేల భీమా రక్షణ ఉంటుందని ప్రకటించారు.ఇక విద్యార్ధులు ఏడాది కాలానికి కేవలం రూ.180 చెల్లిస్తే వారికి ప్రమాద భీమా క్రింద రూ.10 లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఏపీఎన్ఆర్టీ వెబ్సైట్ లో పాలసీ అందుబాటులో ఉంటుందని ప్రవాసాంధ్రులు ఉపయోగించుకోవాలని కోరారు.