ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది.రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా అమలులో ఉన్న ఉచిత విద్యుత్ స్కీమ్ నిబంధనలను మార్చి ఇకపై సబ్సిడీ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో జమయ్యే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది.ప్రభుత్వం ఇందుకోసం ఉచిత విద్యుత్ స్కీమ్ నిబంధనలలో పూర్తిగా మార్పులు చేసింది.
తాజాగా జగన్ సర్కార్ నుంచి ఈ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి.జగన్ సర్కార్ తాజా మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సబ్సిడీని నెలవారీ నగదు రూపంలో రైతుల ఖాతాలలో జమ చేయనుంది.
ఇకపై రైతులు డిస్కంలకు నేరుగా బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది.రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా 1700 కోట్ల రూపాయలతో 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించే విధంగా కొత్తగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతోంది.కేంద్రం సూచనల ఆధారంగా నగదు బదిలీ పథకం అమలు దిశగా అడుగులు వేస్తున్నామని జగన్ సర్కార్ తెలిపింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించిన నగదు జమ కానుందని తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లించకుండా రైతుల ఖాతాలలోకి నగదు జమ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.