ఎత్తులు పై ఎత్తులు వేయకపోతే రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించడం కష్టం.ఇటువంటి విషయాలు వైసీపీ అధినేత జగన్ కు తెలియనిది ఏమీ కాదు.
ప్రస్తుతం కేంద్ర అధికార పార్టీగా ఉన్న బీజేపీ రాజకీయాలు చేయడంలో దూకుడు ప్రదర్శిస్తోంది.ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏపీలో పాగా వేద్దామా అన్నట్టుగా కాచుకు కూర్చుంది.
అంతే కాదు ఏపీలో అధికార, విపక్షం ఏదైనా ఫర్వాలేదు తాము ముందుగా ఎదిగితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.ఏపీలో ప్రస్తుతం టీడీపీ బలహీనం పడడంతో ఇక అధికార పార్టీగా ఉన్న వైసీపీని బలహీనం చేయడమే తమ ప్రధాన విధిగా భావిస్తోంది.
అందుకే అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్యెల్యేలను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
అయితే దీనికి విరుగుడుగా బీజేపీకి చెందిన కొంతమంది నాయకులను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ప్లాన్ చేసుకున్నాడు.
అందుకే ఆర్ ఎస్ ఎస్ నేపధ్యం ఉన్న మాజీ బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీని తమ దారికి తెచ్చుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.గతంలో గోకరాజు గంగరాజు నర్సాపురం నుంచి 2014లో ఎంపీగా పోటీ చేశారు.గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకపోవడంతో పోటీ చేయడానికి నిరాకరించారు.
ఆర్ ఎస్ ఎస్ కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న గోకరాజు గంగరాజు బీజేపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా గంగరాజు అత్యంత సన్నిహితుడు గా ఉంటున్నారు.
ఆయన పార్టీ మారతారనే విషయం పెద్దగా ఎవరూ నమ్మడంలేదు.అయితే ఆయన కుటుంబం మాత్రం వైసీపీలో చేరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
అసలు ఇప్పటికే బీజేపీలో ఉన్న గంగరాజు కుటుంబాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలానే ఇబ్బంది పెట్టారు.కేసులు, కూల్చివేతలతో కొత్త తరహా సందేశాలు పంపింది.కరకట్టపై ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్తో పాటు ఆయనకు ఉన్న కొన్ని వ్యాపారాల విషయంలో అనేక నోటీసులు కూడా అందించారు.అప్పుడే వైసీపీలో చేరాల్సిందిగా వారికి సందేశం కూడా పంపించారు.
అయితే అప్పట్లో వైసీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.కానీ ఇప్పుడు మాత్రం తాము వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధం అంటూ సందేశం పంపించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు బీజేపీ లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో గంగరాజుని ఇలా తెరమీదకు తీసుకువచ్చి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.