గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ వీర విధేయులుగా ముద్రపడిన కీలక నాయకులను నియోజకవర్గ ఇంచార్జిల బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారికి ఆ సీటు కట్టబెడుతూ వస్తున్నారు.దీనిపై వైసీపీలో పెద్ద రచ్చే జరుగుతోంది.
జగన్ ని నమ్మి పార్టీ కోసం కష్టపడితే వెన్నుపోటు పొడుస్తారా అంటూ వారు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో జగన్ కూడా అభాసుపాలు అవ్వడంతో … అసంతృప్తి నేతలందరినీ పిలిచి మరీ జగన్ క్లారిటీ ఇచ్చాడట.
మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 160 నియోజవర్గాల్లో సర్వేలు పూర్తి చేయించినట్లు తెలుస్తోంది.రెండు ప్రయివేటు సంస్థలు, ప్రశాంత్ కిషోర్ టీమ్ లు మూడు నెలలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల అమలవుతున్న తీరుపై ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించారు.ఈ మూడు నెలల సర్వే నివేదికలు దగ్గరపెట్టుకున్న జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జుల మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.ఇదే విషయం వారికి చెప్పాడట.
జగన్లే ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు అయినా గుంటూరు జిల్లా నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి వంటి నేతలు జగన్ ను వ్యక్తిగతంగా ఆయన పాదయాత్ర శిబిరంలో కలిశారు.జగన్ ఏమీ మాట్లాడకుండా సర్వే నివేదికలను అప్పిరెడ్డి ముందు పెట్టి ‘ఈ సర్వే నివేదిక చదివి మీరే చెప్పండి ‘ నేను చేసింది తప్పా రైటా అన్నాడట.
గుంటూరు జిల్లాలోని ఇద్దరు నేతలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఇన్ ఛార్జులకు కూడా సర్వే రిపోర్ట్ లను చూపించి మరీ జగన్ వారినే ఏం చేయాలో చెప్పమని కోరినట్లు సమాచారం.తాము పార్టీ కోసం శ్రమిస్తున్నామని చెప్పినా… ఈ సర్వేలు అబద్ధం చెప్పవు కదా?” అని ఎదురు ప్రశ్న వేయడంతో మరో మాట మాట్లాడలేకపోయారట.
ఇక చాలా నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు కూడా జగన్ దృష్టికి వెళ్లాయి.ఒక్కో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇద్దరు, ముగ్గురు విడివిడిగా చేపట్టడాన్ని కూడా జగన్ తప్పుపడుతున్నారు.పాదయాత్ర విరామ సమయంలో జగన్ నేతలతో చర్చిస్తున్న సందర్భంగా ఈ విషయాలను చెబుతున్నారు.ఎలా ఎవరికీ వారు గ్రూపులు కడితే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది.? ఎంతసేపు మీ రాజకీయమే చూసుకుంటే పార్టీ భవిష్యత్తు ఏమవుతుంది .? అందుకే ఎటువంటి మొహమాటం లేకుండా పనితీరు సక్రమంగా లేని నాయకులను తప్పిస్తున్నా ఇందులో నేను చేసిన పొరపాటు ఏమైనా ఉందా అంటూ జగన్ వారిని ఎదురు ప్రశ్నిస్తున్నాడట.