ఏపీలో రాజకీయ మైలేజ్ పెంచుకున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు తనకు తానే రాజకీయ మైలేజ్ తగ్గించుకునే పనిలో పడ్డాడు.ఇప్పటి వరకు పార్టీ ని పైకి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.
పాదయాత్ర చేస్తున్నాడు.జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.
ఇక ఎన్నికలనాటికి పార్టీకి ఎదురే ఉండదు ఇక ఫ్యాన్ గాలి దుమ్ము లేపడం ఖాయం అనుకుంటున్న సమయంలో జగన్ తప్పటడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఆయన తొందరపాటు వలన పార్టీకి ఇప్పుడు నష్టం జరుగుతోందని వైసీపీ నాయకులే ఆందోళన చెందుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు , విభజన హామీలను అమలు చేయాలంటూ వైసీపీ ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ బంద్ ను ఒంటెద్దు పోకడగా చేసారని జనసేన, వామపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.
అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వీగిపోగానే ఏపీ బంద్ కు పిలుపునివ్వడాన్ని అవి తప్పుపడుతున్నాయి.కనీసం బంద్ కు పిలుపునిచ్చిన తర్వాతైనా తమను వైసీపీ నేతలు వచ్చి కలసి బంద్ కు సహకరించాలని కోరలేదని ఆ రెండు పార్టీలూ చెబుతున్నాయి.
అయితే వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో ఖచ్చితంగా వాస్తవం ఉంది.ఎందుకంటే పిలిస్తే వాళ్ళు వస్తారో రారో అన్న విషయం పక్కనపెడితే అసలు పిలవకపోవడం అనేది జగన్ చేసిన పెద్ద తప్పు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే ఎలాంటి ఆందోళనలకైనా వామపక్ష పార్టీలు మద్దతిస్తుంటాయి.ఇటీవల జరిగిన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలోనూ వామపక్షాలు వైసీపీకి మద్దతుగా నిలిచిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.జనసేన పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తమ అధినేతను సంప్రదించి ఉంటే మద్దతిచ్చి అవకాశం ఉండేది అని వారు చెప్తున్నారు.
వైసీపీ ఇచ్చిన బంద్ లో ప్రత్యేక హోదా సాధన సమితి కూడా పాల్గొనలేదు.వారికి కూడా సమాచారం ఇవ్వలేదు.
జగన్ కీలక అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలా జరుగుతోందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది.జగన్ ది అతి విశ్వాసమా లేక ఆత్మవిశ్వాసమా అనేది తెలియడం లేదు.
అందరినీ కలుపుకెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు అన్న ప్రశ్న వైసీపీ ముఖ్య నాయకుల్లో కనబడుతోంది.