ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు కరోనా వైరస్ భయం పెరిగిపోతోంది.ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరిగిపోతోందనే ఆందోళన కలిగిస్తోంది.
గతంతో పోలిస్తే ఇప్పుడు నమోదవుతున్న కేసులు విపరీతంగా పెరిగాయి.అడ్డూ అదుపు లేనంత స్థాయిలో కేసుల సంఖ్య పెరిగిపోతున్న తీరు ప్రభుత్వాలు కూడా మింగుడు పడడం లేదు.
ప్రస్తుతానికి ఈ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలిగే వాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడంతో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే జనాలకు ఉన్న ఏకైక అవకాశంగా కనిపిస్తోంది.ప్రభుత్వాలు కూడా ఇంతకు మించి మరో మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ, ముందస్తు జాగ్రత్తలను ప్రచారం చేస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ గతంలోనూ, కరోనాతో సహజీవనం చేయక తప్పదేమోనని, మాస్కులు మన జీవితంలో భాగస్వామ్యం కాబోతున్నాయి అంటూ ప్రకటించారు.
అప్పట్లో ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాకుండా, అవహేళన చేశారు.
కానీ అదే నిజం అనే అభిప్రాయం ఇప్పుడు జనాల్లో వచ్చేసింది.తాజాగా మరోసారి కరోనా వైరస్ విషయంలో జగన్ అటువంటి వ్యాఖ్యలే చేశారు .రానున్న కాలంలో కరోనా మహమ్మారి నుంచి ఎవరు తప్పించుకోలేరు అని, ప్రతి ఒక్కరికి ఇది సోకే అవకాశం లేకపోలేదు అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఆరు జిల్లాలకు సంబంధించి ఆరోగ్య శ్రీ కొత్త సేవల విస్తరణ విషయంలో జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ అంతమొందించే వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదని, కరోనాతో మరికొంతకాలం జీవించాల్సిందే అని ఆయన చెప్పారు.
కాకపోతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు అని సూచిస్తున్నారు.ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ విషయంలో అవగాహన పెంచుకోవాలని, ఒకవేళ ఈ మహమారి సోకితే ఎవరికి ఫోన్ చేయాలి ? ఏం చేయాలనే దానిపై అందరికీ స్పష్టమైన అవగాహన ఉండాలని అధికారులను జగన్ ఆదేశించారు.అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడం, వివిధ రాష్ట్రాల నుంచి జనాల రాకపోకలు సాగుతుండడంతో, కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం చాలామంది దీనిని ఇంటి నుంచే నయం చేసుకునే పరిస్థితి ఉందన్నారు.వాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదని, జనాలు అప్రమత్తతతో వ్యవహరిస్తే ఇది సాధ్యమవుతుందని జగన్ సూచిస్తున్నారు.