వైసీపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన, చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.ఏకంగా అధినేత కే గురి పెట్టి ఆయన విమర్శల బాణాలు వదలడం, పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్న ఆగ్రహాన్ని అన్నిటినీ నేరుగా మీడియాకే చెప్పడం, ఆ వ్యవహారాలపై వైసిపి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయడం, ఇలా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం, కేంద్ర బిజెపి పెద్దలను, మంత్రులను, లోక్ సభ స్పీకర్ ను కలిసి అనేక విషయాలపై మంతనాలు జరపడం జరిగింది.ఈ సంగతి పక్కన పెడితే, వైసీపీ ప్రభుత్వం పైనా, జగన్ పైనా రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని వైసిపి శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి.
మొన్నటి వరకు జగన్ ను ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ కలవాలంటే సాధ్యం అయ్యేది కాదు.కేవలం ఇద్దరు, ముగ్గురుకి మాత్రమే అవకాశం దక్కేది.ఇదే విషయాన్ని రఘురామకృష్ణంరాజు హైలెట్ చేశారు.తమ నియోజకవర్గ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, జగన్ దృష్టికి తీసుకువెళ్లాలి అంటే అది సాధ్యపడలేదు అని, జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటర్ దాటుకుని వెళ్లడం కష్టం అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.రోజుకు 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వరకు సాయంత్రం వేళల్లో కలిసేందుకు జగన్ అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, వారి వ్యక్తిగత ఇబ్బందులు, రాజకీయ పరిణామాలు అన్నింటిని తెలుసుకుని, వాటిని పరిష్కరించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.దీంతో వైసీపీ నాయకుల్లో ఇప్పుడు సంతోషం వ్యక్తమవుతోంది.ఇక ఇసుక విషయంలో ప్రజల్లో ఆగ్రహం ఉందన్న విషయాన్ని కూడా రఘురామకృష్ణం రాజు ఎత్తి చూపారు.దీనిపైనా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ట్రాక్టర్ ద్వారా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లేందుకు జీవో జారీ చేశారు.ఇలా చాలా అంశాల్లో రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకొని జగన్ వ్యవహరిస్తున్న తీరు చూసి జగన్ లో మార్పు మొదలైనట్లుగా ఇప్పుడు వైసీపీ లో నడుస్తున్న చర్చ.
రఘురామ కృష్ణంరాజు పార్టీ గీత దాటి తప్పుచేసినా, పార్టీకి మంచి చేశాడు అనేది ఇప్పుడు వైసీపీ నాయకుల అభిప్రాయం.లేకపోతే ఇప్పట్లో జగన్ లో మార్పు వచ్చేది కాదని, పార్టీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోయి ఉండేది అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.