ఎంత చేసినా ఇంతేనా అన్నట్టుగా తయారైంది ఏపీ సీఎంజగన్ పరిస్థితి.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమం విషయంలో అలుపెరగకుండా శ్రమిస్తూ నిరంతరం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు, నిర్ణయలు ప్రకటిస్తూ జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వస్తున్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, ఆ ప్రభావం ఎక్కడా సంక్షేమ పథకాల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.ఇదే సమయంలో అనుకోకుండా కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రావడం, ఏపీలోనూ కేసుల సంఖ్య పెరగడం దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోయింది.
ప్రభుత్వానికి ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోవడం, అదే సమయంలో జీవన ఉపాధి కోల్పోయిన ప్రజల కోసం ఆర్థిక సహాయం చేయాల్సి రావడం, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారీగా సొమ్ము వెచ్చించాల్సి రావడం, ఇవన్నీ జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల్లో సగం కోత విధించారు జగన్.
అయితే ఇదే అంశాన్ని హైలెట్ చేసుకుంటూ రంగంలోకి దిగిన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పైన జగన్ తీరు పైన విమర్శలు చేసి, టీడీపీపై సానుకూలత పెరిగే విధంగా ప్లాన్ చేసుకున్నారు .ఏదైనా ప్రభుత్వం ఏర్పడాలంటే ఉద్యోగస్తులే కీలకంగా మారతారు.ఉద్యోగస్తులు ఎటు మొగ్గు చూపితే అటే ప్రభుత్వాలు ఏర్పడతాయి.ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు కు బాగా తెలుసు.ప్రస్తుతం ఉద్యోగస్తుల జీతాల్లో కోత విధించడంతో అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు టిడిపి అధినేత ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అందుకే వారి సానుభూతి పొందే విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
వాస్తవంగానే జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా వారికి పీఆర్సీని అమలు చేయకపోవడం, వేతనాల్లో కోత విధించడం ఇవన్నీ వారి ఆగ్రహానికి కారణం గా కనిపిస్తున్నాయి.అలాగే మూడు రాజధానులు అంటూ ప్రకటించడంతో పాటు ఉద్యోగులను విశాఖ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు కారణంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఉపాధ్యాయులు విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ప్రభుత్వ వ్యతిరేకతను బాగా ప్రచారం చేయడంలో ఉపాధ్యాయులు ఎప్పుడూ ముందుంటారు.అయితే వారికి ఇప్పుడు కరోనా డ్యూటీలో వేయడం తీవ్ర అసంతృప్తికి కారణంగా అవుతోంది.అలాగే స్కూళ్లకు సెలవు ప్రకటించినా, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వారి ఇళ్లకే చేర వేయడం అతి కష్టంగా మారింది.
వైసీపీ ప్రభుత్వం పై ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉపాధ్యాయుల తరఫున గొంతు పెంచి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టడంతో సహజంగానే ఉద్యోగస్తులు వైసీపీ ప్రభుత్వం పై అసంతృప్తి టిడిపి పై సానుకూలత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు ముందుచూపుతో ఉద్యోగస్తుల తరపున మాట్లాడి సానుకూలత పెంచుకోవడంలో బాగా సక్సెస్ అయ్యారు.