రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి.గెలిచితీరాలి.
అందుకోసం ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా, పార్టీని వదిలి వెళ్ళిపోయినా, అలిగినా, అరిచి గంతులేసినా .ఇవేమి పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది ఏంటో చేసి తీరాలని జగన్ ఫిక్స్ అయిపోయాడు.బలమైన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థులతో పాటు… ఆర్ధికంగా కూడా తట్టుకునే వారయితేనే టీడీపీని బలంగా ఎదుర్కోగలమని జగన్ ఆలోచన.వైసీపీ తరఫున రంగంలోకి దిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు రంగంలో కాచుకుని కూర్చున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.తాము గెలిచి తీరతామని వారు నమ్మకంగా ఉన్నారు.
అయితే జగన్ మాత్రం సర్వేల ద్వారా ఎవరైతే బలమైన అభ్యర్దో తెలుసుకుని వారికే సీటు కేటాయిస్తున్నారు.ఈ విషయంలో ఎటువంటి మొహమాటాలకు జగన్ వెళ్లదలుచుకోలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్న నాయకులను అక్కడ నుంచి వేరే నియోజకవర్గాలకు మార్చడం, మరికొందరికి అసలు టికట్టే లేకుండా చేయడం, ఇంకొందరిని పార్టీ నుంచి సైతం బయటకు పంపుతుండడం వంటి పరిణామాలు వెలుగు చూస్తున్నాయి.వైసీపీ తరఫున టికెట్ గ్యారెంటీ అనుకున్న నాయకులు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు.అయితే, ఇంతలోనే జగన్ నిర్ణయం అనూహ్యంగా మారిపోయింది.
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పార్టీనే నమ్ముకున్న జంగా కృష్ణమూర్తిని గురజాలతో తప్పించడం, అదేవిధంగా అత్యంత కీలకమైన చిలకలూరిపేట నియోజవకర్గంలో మర్రి రాజశేఖర్ను పక్కన పెట్టడం, ఇక తాజాగా గుంటూరు ఎంపీ సీటు సమన్వయకర్తగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును నరసారావుపేటకు పంపడం, విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధను తప్పించి మల్లాది విష్ణు కి సీటు ఇవ్వడం , వంటివి నేతలకు మింగుడుపడకపోయినా ఎన్నికల్లో వైసీపీకి కలిసొస్తుందని జగన్ ఆలోచన.అభ్యర్థుల మార్పు చేర్పులు అప్పుడే అయిపోలేదని దాదాపు 130 నియోజకవర్గాలపై తీవ్ర కసరత్తు జరుగుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.