ఒకవైపు వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులు, మరో వైపు కరోనా, ఇంకో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ఇలా అనేక ఇబ్బందులను ఏపీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు.జగన్ ఏడాది పాలన పూర్తయిందని, ఆనందంగా సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా వరుసగా కోర్టు చిక్కులు వచ్చి పడ్డాయి.
ఏపీలో బీజేపీ తో సహా టిడిపి, జనసేన ఇలా అంతా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కేంద్ర బిజెపి పెద్దల నుంచి జగన్ కు ఆకస్మికంగా పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి ఈ రోజు బయలుదేరి వెళ్ళబోతున్నట్టు సమాచారం.రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితి, రాజకీయ అంశాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కోర్టు కేసులు ఇలా అన్నింటిపైనా క్షుణ్ణంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.అలాగే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏపీ వెంకటేశ్వర వ్యవహారం పైన అమిత్ షాతో జగన్ చర్చించే అవకాశం ఉందట.
ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరావు ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీనికి కేంద్ర హోంశాఖ మద్దతు తెలిపింది.అలాగే క్యాట్ లోనూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.కానీ వీటిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు కు అనుకూలంగా ధర్మాసనం తీర్పు చెప్పడం, ఆయనను మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం వంటి అంశాలపైన జగన్ అమిత్ షాతో చర్చిస్తారట.
అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోనూ జగన్ భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు లు వస్తుండడంపై చర్చించే అవకాశం ఉంది.అలాగే ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంతో పాటు, అనేక అంశాలను ప్రస్తావించబోతున్నట్లు సమాచారం.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా జగన్ సంపాదించాలని చూస్తున్నారు.
ప్రధాని అపాయింట్మెంట్ కనుక దొరికితే అన్ని విషయాల పైన పూర్తిగా చర్చించడంతో పాటు, తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధానిని జగన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.