వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనుమతులు లేని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది.ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన కృష్ణ నది కరకట్టపై దృష్టిపెట్టి ముందుగా గత టీడీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది.
అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల యజమానులందరికి నోటీసులు ఇచ్చారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ అక్రమ కట్టడాల్లో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉండడంతో రచ్చ మొదలయ్యింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వారం రోజుల కిందట సీఆర్డీఏ అధికారులు అంటించిన నోటీసుల గడువు కూడా ముగిసిపోయింది.అప్పుడు అందించిన నోటీసుల ప్రకారం ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోతే వాటిని కూల్చివేయడం ఖాయం అని స్పష్టంగా పేర్కొన్నారు.
అసలు చంద్రబాబు ను కరకట్టపై నుంచి ఖాళీ చేయించాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతూండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మొదలయ్యింది.మరో వైపు చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ సీఆర్డీఏకు సమాధానం పంపించినట్టు తెలుస్తోంది.తన భవనాలకు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని స్పష్టం చేసినట్లు సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.తన భవనానికి ఉన్న అనుమతుల వివరాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ల నకళ్లు, భవనాల రెగ్యులరైజేషన్ కోసం కట్టిన చలానాలు అన్నీ నోటీసుకు సమాధానంగా పంపినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు కరకట్టపై 21 భవనాలు అక్రమంగా నిర్మించినట్టు ప్రభుత్వం గుర్తించింది.ఆ మేరకు ఆ భవనాల యజమానులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసి వారం రోజుల పాటు గడువు ఇచ్చారు.
ఈ వారం రోజుల్లో మొత్తం పదకొండు మంది మాత్రమే సమాధానాలు ఇచ్చారు.ఇక మిగిలిన వారు కోర్టుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు సమాధానం ఇచ్చినవారంతా తమకు అన్నిరకాలైన అనుమతులు ఉన్నాయని, మా భవనాలు అన్ని సీఆర్డీఏ ఏర్పాటు చేయకముందే నిర్మించుకున్నామనే చెబుతున్నారు.అంతే కాకుండా తాము భవనాలు నిర్మించుకోవడానికి అప్పట్లో దీనికి సంబందించిన అన్ని ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయని వారు చెప్పినట్టు తెలుస్తోంది.
అకస్మాత్తుగా చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేత ప్రారంభిస్తే ప్రభుత్వం కూడా ఎన్నో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.