ప్రేమ గుడ్డిది అని ప్రేమ మైకంలో మునిగినన వారు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారని అప్పుడప్పుడు కొంత మంది ప్రేమికులు చెప్పడం మనం చూస్తుంటాం… అయితే తాజాగా ఓ యువకుడు తను ఘాడంగా ప్రేమించిన ప్రేయసి మెప్పు పొందేందుకు గాను ఏకంగా రైలు పట్టాలపై తనకు తానుగా గాయాలు చేసుకుని నాటకమాడి చివరికి పోలీసులకు చిక్కిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోనే కంబదూరు మండలం పరిసర ప్రాంతంలో శశిధర్ అనే ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.
ఇతడు గత కొద్ది కాలంగా ఇదే మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో సానుభూతి పొంది మళ్ళీ తన ప్రేయసితో యథావిధిగా మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడి సలహా మేరకు దగ్గరలో ఉన్నటువంటి రైలు పట్టాలపై కి వెళ్లి గాయాలు చేసుకుని తనను ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్లు బెదిరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఈ సెల్ఫీ వీడియోని తన ప్రేయసికి కూడా పంపినట్లు సమాచారం.
ఆ తర్వాత కళ్యాణ దుర్గం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.
అయితే అప్పటికే యువకుడి వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన శశిధర్ ని తమదైన శైలిలో విచారించగా తన ప్రేయసి మెప్పు పొందేందుకే తాను ఈ నాటకం ఆడినట్లు ఒప్పుకున్నాడు.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.అంతేగాక అబద్ధపు నాటకాలు ఆడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.