కాబోయే భార్య తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి, మరణించిన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో చోటుచేసుకుంది.సదరు యువకుడు ఓ యువతిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
అందులోనూ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.పైగా వచ్చే నెలలో వీరికి పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు పెద్దలు.
అంత సాఫీగా జరుగుతోందన్న ఆ సమయంలో ఓ హఠాత్పరిణామం చోటు చేసుకుంది.మనసిచ్చిన అమ్మాయికి మనువాడక ముందే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన శేఖర్ ఆళ్లగడ్డ కు చెందిన ఓ యువతిని ప్రేమించాడు.
ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.ఇక వీరిద్దరి కోసం వచ్చే నెలలో వివాహానికి ముహూర్తం కూడా ఓకే చేశారు.అయితే ఇంతలోనే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొని చనువు చాలించాడు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నిశ్చితార్థం జరిగిన తర్వాత కాబోయే దంపతులు బైక్ పై బయట తిరిగేవారని, ఈ విషయం తెలిసిన సదరు యువతి తల్లిదండ్రులు పెళ్లి కాకుండా ఇలాంటివి చేయొద్దని ఇద్దరిని మందలించారు.
ఈ చిన్న విషయానికి మనస్తాపం చెందిన శేఖర్ పీకల దాకా మద్యం సేవించి, తన ఇంటి సమీపంలో ఉన్న స్మశానం కి చేరుకొని అక్కడ విషగుళికలు తిన్నాడు.ఆ తర్వాత ఆ విషయాన్ని వారి స్నేహితులకు ఫోన్ చేసి తాను విషగుళికలు తిన్నానని చెప్పడంతో వారు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు.
అయితే దురదృష్టవశాత్తు శేఖర్ కోలుకోలేక మరణించాడు.ఈ విషయంపై మృతుడు శేఖర్ తల్లి ఫిర్యాదు అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.