మాట్లాడితే చాలు పార్టీలో కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం చాలా ఉంది అంటూ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంతా తరచుగా చెప్పే మాట ఇది.పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలి అన్నా, జగన్ గాలిని తట్టుకొని 2024 ఎన్నికల్లో టిడిపి బలం పెంచుకోవాలి అన్నా, పార్టీలో సమూల మార్పులు జరగాల్సిందేనని, అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు చెబుతూనే ఉంటారు.
ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు లోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు అంతా ఇదే విధమైన ప్రసంగాలు చేశారు.
ప్రస్తుతం వైసిపికి యూత్ లో మంచి ఆదరణ ఉంది.ఆ తర్వాత జనసేన పార్టీకి అత్యధికంగా యువ నాయకుల మద్దతూ ఉంటూ వస్తోంది.
కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఎక్కువమంది సీనియర్ నాయకులు ఉండటం, పార్టీలో పదవులు అన్ని వారికే దక్కుతూ ఉండడం తో యువ నాయకులకు కు పెద్దగా ప్రోత్సాహం పార్టీలో కనిపించడం లేదు.
టిడిపి వైపు కంటే వైసీపీ జనసేన వైపు నాయకులు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.2019 ఎన్నికల్లోనే ఈ విషయం అర్థమైంది.ఈ పరిస్థితిని మార్చి తన రాజకీయ వారసుడు నారా లోకేష్ కు ఎటువంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చేసేందుకు, యువ నాయకులు మద్దతు ఆయనకు ఉండేవిధంగా బాబు కసరత్తు చేస్తున్నారు.కొద్ది నెలల క్రితం టీడీపీలో పెద్ద ఎత్తున పార్టీ పదవులను బాబు భర్తీచేశారు.
అయితే అందులో మెజార్టీ పదవులు సీనియర్ నాయకులకు దక్కడంతో యువ నాయకులు కాస్త అసంతృప్తికి గురయ్యారు.ఇప్పుడు లోకేష్ కు రానున్న రోజుల్లో అన్ని రకాలుగా మంచి గుర్తింపు ఉండి తిరుగులేని రాజకీయ నాయకుడిగా బలపడాలి అంటే , యువ నాయకులు సహాయసహకారాలు అవసరమని బాబు ఎప్పటి నుంచో అభిప్రాయపడుతూ వస్తున్నారు.
కానీ సీనియర్ నాయకుల విషయంలో వారికి ప్రాధాన్యం ఇవ్వకపోతే వారు అలక చెందుతారని, మొహమాట పడుతూ బాబు వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.ప్రజా బలం లేని కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు అదేపనిగా పార్టీలో కొత్త రక్తం ఎక్కించాలి అంటూ హడావుడి చేస్తున్నారు.కానీ వారు మాత్రం పార్టీలో కీలకమైన పదవుల నుంచి తప్పుకునేందుకు కానీ, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు కానీ సిద్ధ పడకపోవడంతో, యువరక్తం అనేది కేవలం టిడిపిలో మాటలు వరకే పరిమితమైపోతోంది.