ఎమ్మెల్యే పై ఒక యువకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కర్ణాటక లో చోటుచేసుకుంది.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేథ్ పై ఒక యువకుడు ఉన్నట్టుండి పదునైన ఆయుధం తో దాడికి తెగబడ్డాడు.
ఈ క్రమంలో సేథ్ గాయపడడం తో హుటాహుటిన సమీపంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.ఎమ్మెల్యే పై కత్తితో దాడికి పాల్పడిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే మద్దతుదారులు అందరూ కలిసి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఆదివారం రాత్రి మైసూరులో ఒక వివాహ వేడుకకు తన్వీర్ హాజరైన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.ఎమ్మెల్యే పై దాడికి పాల్పడిన వ్యక్తిని 24 ఏళ్ల ఫర్హాన్ పాషాగా గుర్తించారు.
ఎమ్మెల్యేకు అతి దగ్గరగా వెళ్లిన తన్వీర్ పాషా కత్తితో దాడి చేసి పరారయ్యే ప్రయత్నం చేయడం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది.ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఎమ్మెల్యేను దగ్గర్లోని కొలంబియా ఆసియా ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పై అధికారిక సమాచారం వెల్లడికానప్పటికీ నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ఎమ్మెల్యే పై దాడి కి పాల్పడిన నిందితుడు ఉదయగిరికి చెందిన హస్తకళాకారుడని, అయితే ఎందుకు ఎమ్మెల్యే సేధ్ పై దాడికి పాల్పడ్డాడు అన్న వివరాలపై ఇంటరాగేట్ చేస్తున్నారు అధికారులు.
అయితే అధికారుల విచారణ లో ఉద్యోగం కోసం ఎమ్మెల్యేలను అతను రెండుమూడు సార్లు కలుసుకున్నాడని, ఒకవేళ ఆ విషయంలో ఇంకా జాప్యం జరుగుతుండడం తో తీవ్ర నిరాశకు గురై ఇలా దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.