మన హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ విధంగా సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటిని విష్ణుమూర్తికి అంకితం చేస్తారు.
కానీ జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమైనది.ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు.
అసలు యోగిని ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలి.ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఏకాదశి రోజున కఠిన ఉపవాస దీక్షలతో విష్ణు దేవుడికి పూజలు చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.
మరి ఈ ఏడాది యోగిని ఏకాదశి 2021 జులై 5వ తేదీ అనగా సోమవారం యోగిని ఏకాదశి వస్తుంది.సోమవారం రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
సోమవారం ఉదయం నుంచి రాత్రి 10:30 నిమిషాల వరకు ఎంతో పవిత్రమైన సమయంగా భావిస్తారు.ఈ యోగిని ఏకాదశిని పురస్కరించుకొని చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటూ యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు.
సోమవారం ఉదయం 5 గంటల 29 నిమిషాల నుంచి 8:16 నిమిషాల వరకు ఎంతో మంచి సమయం ఈ సమయంలో విష్ణు దేవుడికి పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది.యోగిని ఏకాదశి రోజు వేకువ జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి.అదేవిధంగా గంగాజలంతో పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోకు ప్రత్యేక పుష్పాలతో అలంకరించాలి.స్వామివారి చిత్రపటం ఎదురుగా పసుపు కుంకుమ ఐదు రకాల పండ్లు తులసి మాలలను సమర్పించి పూజ చేయాలి.
అదేవిధంగా సాయంత్ర సమయంలో కూడా విష్ణుమూర్తిని ఈ విధంగానే పూజించాలి.ఎంతో పవిత్రమైన యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక వ్యాధులు నుంచి విముక్తి కలుగుతుంది.
అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.