జమ్మూ కాశ్మీర్ లో గత కొద్దీ రోజులు గా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇంకా సర్దుకోలేదు.ఆర్టికల్ 370 రద్దు తో అక్కడ పరిస్థితులు చేయిదాటి పోకుండా కేంద్రం భారీ గా బలగాలను మోహరించడం తో పాటు అక్కడి ప్రధాన పార్టీ అధినేతలను,నేతలను హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే.
ఇంకా అక్కడ పరిస్థితులు చక్కబడకుండానే ఇతర పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అక్కడకి చేరుకుంటూ పరిస్థితులను మరింత కఠినతరం చేస్తున్నారు.ఆర్టికల్ 370 రద్దు తరువాత గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ కూడా జమ్మూ కాశ్మీర్ లో నేతలను కలవాలని శ్రీనగర్ కు చేరుకున్నారు.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకొని ఆయనను తిరిగి పంపించేశారు.అయితే ఈ రోజు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా తమ పార్టీ ఎమ్మెల్యే ను కలవాలని శ్రీనగర్ కు వచ్చారు.అయితే పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోగా దానికి వారు నిరాకరించడం తో పరిస్థితి మరింత ఉద్రిక్తత కు దారి తీయకుండా సీతారాం ఏచూరి ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా ఆయన తో పాటు ఉన్న డీ రాజా ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల ఆర్టికల్ 370 రద్దు కారణంగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.మరోపక్క ఈ విధంగా పోలీసులు తమ తమ పార్టీ నేతలను కలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ కాశ్మీర్ గవర్నర్ కు లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.
ఏదేమైనా అక్కడ పరిస్థితులు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు.ఈ కీలక మైన ఆర్టికల్ 370 ని రద్దు చేయడం తో అక్కడ ఎలాంటి ఘటనలు అయినా చోటుచేసుకోవచ్చు అని భావించి కేంద్రం ముందుగానే అక్కడ భారీ ఎత్తున బలగాలను మోహరించింది.ఇంటెలిజెన్స్ కూడా ఎలాంటి ఘటనలు అయినా చోటుచేసుకోవచ్చు భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలని హెచ్చరించింది కూడా.