ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గల్లంతయ్యాయనే చెప్పొచ్చు.అసెంబ్లీలో ఆ పార్టీలకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
బీజేపీ తరఫున మాధవ్ ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నారు.ఇకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ బలం కూడా అంతంతే ప్రభావితం చేసేంత శక్తి కూడా తగ్గిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని జనసేన బలపరిచినప్పటికీ డిపాజిట్ కూడా దక్కలేదు.ఈ క్రమంలో బీజేపీ పేరుకే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉండగా, తాజాగా వైసీపీ మంత్రి బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను కుట్రలు చేస్తోందని ఆరోపించారు.కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తిని ఏపీ సీఎం పీఠంపై కూర్చొబెట్టాలని బీజేపీ పావులు కదుపుతున్నదని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.అసలు ఏపీలో బలమే లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తుందంటూ? ప్రశ్నిస్తున్నారు.ఇలా బీజేపీపై వ్యాఖ్యలు చేసి అనవసరంగా ఆ పార్టీని హైలైట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తోందని వైసీపీ వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా బీజేపీని మార్కెట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, రాష్ట్రంలో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి అందరికీ విదితమే.ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్న సోము వీర్రాజుపైన వేటు పడే చాన్సెస్ ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అలాంటిది ఏం లేదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.మొత్తంగా ఏ విధంగా చూసినా బీజేపీ ఏపీలో పుంజుకునే అవకాశాలు తక్కువేననే వ్యాఖ్యలు వినబడుతున్న క్రమంలో వైసీపీ బీజేపీని హైలైట్ చేయడాన్ని బట్టి చూస్తే ఏదో మతలబు ఉందనే చర్చ షురూ అయింది.