రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కునేందుకు రాజకీయ పార్టీలు వివిధ అస్త్రాలను ఉపయోగిస్తూ ఉంటాయి.విమర్శలు చేయడమే కాకుండా, ఆర్ధిక మూలాల పైన దృష్టి పెట్టి ఇబ్బందులు సృష్టిస్తే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం అవుతుందనే అభిప్రాయం అధికార పార్టీలలో సహజంగానే కలుగుతుంది.
దీంతో తమ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు.ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసిపి సైతం టిడిపి ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టింది.
టిడిపికి ఆర్థికంగా అండదండలు అందిస్తున్న నాయకుల వ్యాపార వ్యవహారాల పై సమగ్రం గా ఆరా తీస్తోంది. ఇప్పటికే టీడీపీలో ఆర్థికంగా బలమైన నాయకులను గుర్తించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు, వారిలో చాలామంది పార్టీ మారేలా చేయడం లేక రాజకీయాలకు దూరంగా ఉండేలా చేయడంలో వైసిపి సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపికి ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తే సగం విజయం సాధించినట్లే అభిప్రాయంతో వైసీపీ ఉంది.ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా టిడిపి బల పడినట్లుగా నివేదికను ప్రభుత్వానికి అందిస్తుండటంతో సరికొత్త వ్యూహానికి తెరతీశారు.
దీనిలో భాగంగానే టీడీపీకి ప్రస్తుతం ఆర్థిక అండదండలు అందిస్తున్న వారు ఎవరు ? వారి వ్యాపార వ్యవహారాలు ఏమిటనే విషయంపై దృష్టి సారించింది.ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు వైసీపీకి సహకరిస్తూ ఉండడంతో టిడిపి నేతలు టార్గెట్ అవుతున్నారు.
ఇప్పటికే జేసీ బ్రదర్స్ ను ఆర్థికంగా అష్ట దిగ్బంధనం చేశారు.వారి కేసులు పాతవే అయినా, వాటిని స్పీడ్ పెంచేలా చేయడంలో వైసిపి, బీజేపీలు సక్సెస్ అయ్యాయి.
ఇక బీద మస్తాన్ రావు, సిద్ధ రాఘవరావు , కరణం బలరాం, ఇలా చాలామంది టిడిపికి దూరమయ్యారు.ఆర్థికంగా టిడిపికి అండదండలు అందించిన మాగంటి మురళీమోహన్ , నారాయణ వంటి వారు ప్రస్తుతం టిడిపికి దూరంగా ఉంటున్నారు.
ఇక ఇప్పుడు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వీరే కాకుండా, టిడిపిలో ఉన్న ఆర్థిక స్థితి మంతుల వివరాలు పైన వైసీపీ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం .వీరందరినీ టార్గెట్ చేసుకుంటే 2024 ఎన్నికల్లో టిడిపి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటుంది అని, అది తమకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది అనే అంచనాలో వైసీపీ ఉందట.