మొదటి నుంచి ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల విషయమై ఏపీ లో ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా వైరస్ ప్రభావం తో ఆ ఎన్నికలను రద్దు చేశారు.
ఈ ఏడాది ఆ ఎన్నికల ను నిర్వహించారు.అయితే ఫలితాలు రాబోతున్నాయి అనుకున్న సమయంలో, ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో అసలు ఈ ఎన్నిక ప్రక్రియ యధావిధిగా ఉంటుందా లేక పూర్తిగా ఎన్నికలను రద్దు చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారా టెన్షన్ అన్ని పార్టీలలోను కనిపించింది.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు రెండుసార్లు ఖర్చు చేయాల్సి రావడంతో కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తూ వచ్చారు.చివరకు కోర్టులు ఈ విషయం లో నిర్ణయం తీసుకోవడం తో రేపు 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించబోతున్నారు.
దీంతో ఎవరు ఎంపిటిసి జెడ్పిటిసి ఫలితాలలో మెజార్టీ స్థానాలు ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదో తేదీన జరిగిన ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా అన్ని పార్టీలు ఎదురు చూపులు చూస్తూ వచ్చాయి.
రేపటితో ఆ నిరీక్షణకు తెరపడింది.ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీలు ఉండగా, ఎనిమిది స్థానాలకు ఎన్నిక జరగలేదు.652 స్థానాలకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది.126 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.కానీ కొంతమంది అభ్యర్థులు మృతి చెందడం, ఇంకా అనేక కారణాలతో 81 స్థానాలలో ఎన్నికను నిలిపివేశారు.ప్రస్తుతం 515 జేడ్పిటిసి స్థానాలకు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.
ఇక ఎంపీటీసీ స్థానాలు 10,047 ఉండగా, అందులో 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు.దీంతో మొత్తం 9672 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అయింది.
వీటిలో 2,371 స్థానాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.వివిధ కారణాలతో 81 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు.
7220 ఎంపిటిసి స్థానాలకు మాత్రమే కౌంటింగ్ నిర్వహించబోతున్నారు.ఫలితాలపై వైసీపీలో ఉత్సాహం అప్పుడే కనిపిస్తోంది .తమ పార్టీ అధికారంలో ఉండటంతో సహజంగానే తమ పార్టీ అభ్యర్థులు విజయాన్ని అందుకుంటారని, అంతకుముందు జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుకున్నారని , ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని వైసిపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, టిడిపి మాత్రం ఎన్నికల ఫలితాల పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.గతంలో మాదిరిగానే ఈ ఫలితాలు అధికార పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయనే అభిప్రాయంతో సైలెంట్ అయిపోయింది.