ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఓ ఇద్దరు ఏపీ అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా ప్రభావం జనాల్లో ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో దానిని ప్రచార వేదికగా చేసుకుంటూ కేవలం మీడియాలో పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో వీరు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది.
ముఖ్యంగా నగిరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కరోనా వైరస్ ప్రభావం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు.ఆమె నగిరి నియోజకవర్గంలో అప్పుడప్పుడు వైరస్ నిరోధక ద్రావణాన్ని పి పిఈ కిట్లు వేసుకుని మరి చల్లుతూ, ప్రజలకు తాను అండగా ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు.
అలాగే అక్కడక్కడ అన్నదానం కార్యక్రమాలు చేస్తూ, పోలీసులకు స్వయంగా భోజనాలు వండి వార్చుతూ బాగా ప్రచారం పొందుతున్నారు.అలాగే ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని ప్రజలకు పంపిణీ చేస్తూ, మీడియాలో పాపులర్ అయ్యే విధంగా రోజా చూసుకుంటున్నారు.
తాను నిత్యం ప్రజల్లోనే ఉంటానని, కరోనాకి భయపడేది లేదని మీడియా కు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇంతవరకు కు ఆక్షేపించడానికి ఏమీ లేకపోయినా, ఆమె డాక్టర్లు ధరించే ఎన్ 95 మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకుని వెళ్తున్నారు.
ఈ విషయాన్నీ లైట్ తీసుకున్నా, ఇటీవల ఆమె ఓ గ్రామానికి వెళ్లిన సందర్భంగా ఆమె కోసం రెడ్ కార్పెట్ వేయించుకుని, గ్రామస్తులంతా లైన్ లో నిలుచుని ఆమె పాదాలపై పూలు చల్లుతూ ఉండగా ఆమె నడుచుకుంటూ దర్పం ప్రదర్శించుకుంటూ వచ్చారు.ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రోజా కు ఎక్కడలేని ఆనందం వచ్చింది.
అయితే పనులు లేక ఇప్పటికే ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన ఆమె వారితో పనులు చేయించుకోవడం విమర్శలపాలయ్యింది.
ఇక మరో వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని విషయానికి వస్తే, ఆమె కూడా మిగతా ఎమ్మెల్యేలందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు.ప్రచారం విషయంలో తాను ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.సొంతంగా ఆమె ఇప్పటికే ఒక సోషల్ మీడియా టీమ్ ను ఏర్పాటు చేసుకుని వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు.
ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ ఇంటికి చేరే వరకు ఆమె రోజువారీగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ? ఏ విధంగా ప్రచారం చేయించుకోవాలి అనే అంశాలపై ప్రత్యేకంగా ఆమె డిజైన్ చేయించుకుంటున్నారు.దాని ప్రకారం రోజుకు ఒకటి రెండు చోట్ల కి వెళ్లడం, దానిని కెమెరాల్లో చిత్రీకరించడం, పబ్లిసిటీ కోసం సొంతంగా కెమెరాలతో ఓ టీమ్ ను వెంట తీసుకు వెళ్లడం, ఇలా భారీగానే ఆమె లబ్ది పొందుతున్నారు.
ఆమె చేస్తున్న చిన్న చిన్న సహాయాన్ని కూడా పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు.ఒక్క నెలలోనే ఆమె సోషల్ మీడియా బడ్జెట్ ఎనిమిది లక్షలు దాటిపోయిందనే లెక్కలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.మిగతా ఎమ్మెల్యేలు కంటే తాము గొప్పగా సేవ చేస్తున్నామని, కరోనాను కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం ధైర్యంగా తిరుగుతున్నామని చెప్పుకొనేందుకే కాకుండా త్వరలో చేపట్టబోయే మంత్రి పదవుల్లో స్థానం దక్కించుకునే విధంగా కూడా వీరు వ్యవహరిస్తుండడం విమర్శల పాలవుతోంది.
.