ఏపీ లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది.అందివచ్చిన అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ముందడుగు వేయాలని చూస్తోంది.
ఇప్పటికే వైసీపీ లో అంతర్గత ప్రక్షాళన మొదలుపెట్టిన జగన్ తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీని అన్నిరకాలుగా దెబ్బకొట్టాలని చూస్తోంది.దీనిలో భాగంగానే ముందుగా చంద్రబాబు వియ్యకుండు నందమూరి బాలకృష్ణను రాజకీయంగా బాబుకి దూరం చేయాలనీ చూస్తోంది.
అందుకే ఆరు నూరైనా సరే హిందూపురంలో బాలయ్య మళ్ళీ పోటీ చేస్తే కనుక ఓడించి ఇంటికి పంపేందుకు వైసీపీ అనేక ప్లాన్ లు వేసుకుని వాటిని ఒక్కొక్కటీ అమలు చేస్తోంది.నందమూరి కుటుంబం మీద ఏపీలో అంతో ఇంతో సానుభూతి ఉంది అది టీడీపీ కి దక్కకుండా చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి అనూహ్యంగా బరిలో దిగింది నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని.చంద్రబాబు ఒత్తిడితోనే ఆమె పోటీ చేసినట్లు ప్రచారం జరిగింది.కానీ ఆమెను గెలిపించడం కోసం ఎంతమంది ఎన్నిరకాలుగా కష్టపడినా… ఆమెకు విజయం మాత్రం దక్కలేదు.అయితే ఆమె ఓటమికి తెరవెనుక టీఆర్ఎస్ పార్టీకి సహకరించింది మాత్రం వైసీపీ అనే టాక్ ఉంది.
కూకట్పల్లిలో సీటు దక్కించుకోవడం అటు టీడీపీకి ఇటు టీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మకం కావడంతో వైసీపీ సహకారంతో టీఆర్ఎస్ ఈ సీటుని దక్కించుకుంది.దీని ద్వారా అటు టీఆర్ఎస్.
ఇటు వైసీపీ లు తమ ఉమ్మడి ప్రత్యర్థి చంద్ర బాబు పై కక్ష తీర్చుకున్నారు.ఇప్పుడు ఏపీలోనూ బాలయ్యను టీడీపీకి దూరం చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉంది.
హిందూపురం నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.ఇక్కడ నందమూరి ఫ్యామిలీకి ఇది అడ్డా అనే చెప్పవచ్చు.ఎందుకంటే… ఇక్కడ నుంచి.1985 నుంచి మూడుసార్లు ఎన్టీఆర్.1996లో హరికృష్ణ ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లారు.ఆ తర్వాత పదేళ్ల పాటు గ్యాప్ వచ్చింది.99 నుంచి వెంకటరాముడు, పామిశెట్టి రంగనాయకులు, పీ.అబ్దుల్ గనీ తెలుగుదేశం నుంచి గెలిచారు.2014లో మళ్ళీ నందమూరి కుటుంబం ఎంట్రీ ఇచ్చింది.సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ తన సీటును త్యాగం చేసి నందమూరి బాలకృష్ణను గెలిపించాడు.
కానీ వచ్చే ఎన్నికల్లో కూడా బాలయ్య పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో… బాలయ్య కోసం సీటు త్యాగం చేసిన అబ్దుల్ గని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇప్పుడు ఆయనే బాలయ్యకు ప్రత్యర్ది కాబోతున్నారు.
దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం అయితే కనిపిస్తోంది.టీడీపీతో ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు… ఈ నేపథ్యంలో బాలయ్యను కూడా పార్టీకి దూరం చేస్తే… నందమూరి బ్రాండ్ టీడీపీకి దూరం అవుతుంది అనే ఆలోచనలో వైసీపీ ఉంది.