ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తేనే రాజకీయాల్లో పై చేయి సాధించగలం అనే సూత్రాన్ని అన్ని రాజకీయ పార్టీలు బాగానే పాటిస్తున్నాయి.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలో నూతన ఉత్సాహం తీసుకువచ్చే విధంగా మహానాడును ప్రతిస్త్మకంగా నిర్వహించాలని చూస్తున్నారు.
భారీ సంఖ్యలో కాకపోయినా, అతి కొద్దిమంది ముఖ్య నాయకులతో అయినా దీని నిర్వహించాలని చూస్తున్నారు.ఒకవేళ మహానాడుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా, భారీగా మహానాడును నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహానాడు జరగలేదు.ఈ ఏడాది కరోనా కారణంగా అది కూడా వాయిదా పడుతుందని అందరూ అంచనా వేయగా, బాబు మాత్రం మహానాడు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఇక అధికార పార్టీ వైసీపీ మాత్రం మహానాడు లోనే టీడీపీకి మహా ఝలక్ ఇవ్వాలని చూస్తోంది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
అయితే వారిని నేరుగా పార్టీలో చేర్చుకుంటే అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు వారి చేరికను వాయిదా వేస్తూ వచ్చారు.ఇప్పుడు మాత్రం మహానాడు నిర్వహించే తేదీకి ముందుగానే తెలుగుదేశంపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఆ పార్టీ కి రాజీనామా చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
దీని ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రద్దు అయ్యేలా చేయాలన్నది వైసీపీ ప్లాన్.అలాగే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.
దీనిద్వారా తెలుగుదేశం పార్టీని మానసికంగా దెబ్బ కొట్టాలని వైసిపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు వైసీపీలో వచ్చేందుకు ఆసక్తి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల లిస్ట్ మొత్తం వైసీపీ రెడీ చేసుకుంది.పార్టీలో చేరేందుకు ఏ క్షణమైనా పిలుపు రావచ్చని, మీరంతా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే వారికి సమాచారం అందినట్టు తెలుస్తోంది.ఇక విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు పార్టీ మారే ఆలోచన ఉన్న నాయకులందరికీ ఫోన్ చేసి బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో మీకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని, పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలి అంటూ వారికి నచ్చచెప్పే పనిలో ఉన్నారట.
.