దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎన్నో ఉచిత హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే క్రమంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై పెద్ద చర్చ జరుగుతోంది.ఉచిత పథకాల ద్వారా, పేదలు సామాన్యులకు మేలు జరుగుతున్నా, భవిష్యత్తులో ఈ పరిణామాలు దేశ ఆర్థిక పరిస్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.
సుప్రీంకోర్టులో ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం సరికాదు అంటూ పిటిషన్ దాఖలు అయ్యింది.సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమ తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరింది. ఇప్పటికే తమిళనాడు అధికారం పార్టీ డిఎంకె, ఢిల్లీ పంజాబ్ లలో అధికార పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.తాజాగా ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ పథకాలనే నమ్ముకుని ముందుకు వెళుతున్న క్రమంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అవసరాల గురించి ప్రత్యేకంగా వివరించారు.ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి అవసరమైన చేయూతను ఈ పథకం ద్వారా ఇస్తున్నట్లు విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
పేద ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వాల బాధ్యతని, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా , అమ్మఒడి కార్యక్రమాలు ప్రజలు ఆర్థికంగా అవకాశం కల్పిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.వాటిని సామాజిక పెట్టుబడిగా భావించాలని, ఉచిత పథకాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని, అలా చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.ఎన్నికలకు ఆరు నెలలు ముందు ఏడాది ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పటికప్పుడు పథకాలను అమలు చేసే పాలకులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.