ఏపీలో పొలిటికల్ హీట్ను అమాంతంగా పెంచిన ఘటన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయడం.అంతే కాదు రాజకీయంగా తీవ్ర దుమారం కూడా రేపుతోంది.
అయితే రఘురామ అరెస్ట్ విషయంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం గమనించే ఉంటారు.ఇప్పటికే రఘురామ అరెస్ట్ విషయంలో ఎన్నో ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది.
పలు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ విషయంలో పచ్చ పార్టీ చాలా అతి ప్రవర్తిస్తుందని, పచ్చ పార్టీ పెద్దలకు అరెస్ట్ పై గొడవ చేయడం తప్ప, మరేమీ పట్టడం లేదని, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.
సీఐడీ కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణంరాజు కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా అసత్యపు ప్రచారం చేశారని, వారి మాటలు చూస్తుంటే ఈ ఏడాది ప్రపంచ అబద్ధాల పోటీలు పెడితే అందులో వారు ఫస్ట్ ప్రైజ్ కు ఎంపికవడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు.ఏపీ రాజకీయాలను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని, గత రెండేళ్ల నుండి ప్రజలు మీకు వాత పెడుతున్నా బుద్ధి రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.