నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో ఏం చేయాలి ? ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయం వైసీపీకి అర్ధం కావడం లేదు.ఇప్పటికే పెద్ద ఎత్తున టిడిపి నాయకులను చేర్చుకుంటూ మంచి జోష్ మీద ఉన్న వైసీపీకి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
వైసిపి అగ్రనేతలే లక్ష్యంగా ఆయన విమర్శలు చేస్తూ వస్తుండడం, ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు.జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ దాటుకుని వెళ్లడం కష్టం అంటూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి లపై పరోక్షంగా ఆయన విమర్శలు చేస్తున్నారు.
జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగానే ఇలా మీడియా ద్వారా మాట్లాడాల్సి వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, దానికోసమే ఇప్పుడు వైసిపి ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
రఘురామకృష్ణం రాజు కి బ్యాంకు రుణాలు ఎగవేసిన చరిత్ర ఉందని, అందుకే ఆయన బిజెపి లోకి వెళ్లాలని అనుకుంటున్నారు అంటూ వైసీపీ నాయకులు ఆయనపై ప్రతి విమర్శలు చేస్తున్నారు.ఇక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వంటి వారు రఘురామకృష్ణరాజు కాస్త తేడా మనిషి అని, పట్టించుకోనవసరం లేదు అంటూ విమర్శించారు.
ఈ వార్ ఇలా జరుగుతుండగానే రఘు రామకృష్ణంరాజు కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో రాజకీయాలు హీటెక్కిన ఈ సమయంలో బిజెపి ఈ విధంగా తెరవెనుక ఉండి రఘురామకృష్ణంరాజుతో ఈ విధంగా వ్యాఖ్యలు చేయిస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఇప్పుడు కలుగుతోంది.
ఆయన త్వరలోనే బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని, అందుకే ఇప్పుడు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఏపీలో బలపడాలని చూస్తున్న బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
రఘురామకృష్ణం రాజు ఒక్కరే కాకుండా, ముందు ముందు మరి కొంత మంది నాయకులను బిజెపి వైపు తీసుకువచ్చేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ, టిడిపి హవా తగ్గిస్తే కానీ, రాజకీయంగా పట్టు సాధించలేమనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు రఘురామకృష్ణంరాజు పై ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.తన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం ఆగ్రహం చెంది తప్పకుండా తన పై సస్పెన్షన్ వేటు వేస్తుందనే అభిప్రాయంతో రఘురామకృష్ణరాజు ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా ఇప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ లభించడంతో ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.