భయపెడితే భయపడిపోయే రకం కాదు, మీకంటే ఎక్కువగా భయ పెట్టగలను అనే సంకేతాలు ఇస్తున్నారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.సొంత పార్టీపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వస్తున్న ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఉండిపోవడంతో పాటు, బిజెపి అండదండలు కాస్త ఉన్నట్టుగానే కనిపిస్తుండటంతో, రఘురామ కృష్ణంరాజు ఈ స్థాయిలో వైసిపి ప్రభుత్వం పైన, ఆ పార్టీ విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, వైసీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయనకు కొన్ని రకాల బెదిరింపులు వస్తుండడం పైన తాజాగా ఆయన స్పందించారు.
గతంలో కంటే ఈ మీడియా సమావేశంలో కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.కడప, కర్నూలు నుంచి జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు తనకు ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని, ఎవరో వైయస్ రెడ్డి అంట, రామిరెడ్డి అంట నాకు ఫోన్ చేసి నన్ను ఏదో చేస్తాను అటూ బెదిరిస్తున్నారని, మీరు మా ఇంటికి రండి సిఆర్పిఎఫ్ వాళ్ళు షూట్ చేస్తారు అంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగకుండా, ఏ రెడ్డీస్ ఏంట్రా మీరు చేసేది ? రాజీనామా చేయాలంటూ నన్ను బెదిరిస్తారా ? నేను ప్రజల మద్దతుతో గెలిచాను.అబద్ధాలాడి మీరు అధికారంలోకి వచ్చారు.
నన్ను రాజీనామా చేయమంటారా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, గూబ పగిలిపోద్ది నేను రాజీనామా చేయను.నేను జగన్ బొమ్మతోనే కాదు, నా బొమ్మతోనూ ఎన్నికల్లో గెలిచాను అంటూ మరికొన్ని ఘాటు వ్యాఖ్యలతో వైసీపీని విమర్శించారు.
ఈ సందర్భంగా అమరావతి ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. ఏపీ ప్రభుత్వం బాటా కంపెనీ తరహాలో 9.99 లక్షల కోట్లు కేంద్రాన్ని అడిగిందని, ఆ డబ్బు ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి చేయలేకపోతున్నామని, ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టాలని చూస్తోందని, అమరావతిలో రాజధాని నిర్మాణం చేయలేని వారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారో అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
రాజధాని అమరావతి లోనే ఉంటుంది.
ఇందులో తిరుగులేదు అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.ఈసందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడంపైన రఘురామకృష్ణంరాజు ఘాటుగా ప్రశ్నించారు.
రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.ఆయనను కట్టడి చేసే పరిస్థితి లేకపోవడం, ఆయనకు బిజెపి అండదండలు ఉన్నాయి అన్న అనుమానంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వేచిచూసే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో, ఇదే అదనుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.
ఈ వ్యవహారానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.