రాజధాని విషయంలో ఏపీ సీఎం జగన్ ఎంత మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారో అంతే మొండి పట్టుదలతో అమరావతి ప్రాంతం రైతులు ఉన్నారు.ఈ ప్రాంతం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ వారు గత నెలరోజులుగా ఉద్యమాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా వారు దాదాపు నెల రోజులుగా రాజధాని పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతూ దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరిగేలా చేస్తున్నారు.ఒకరకంగా ఇది జగన్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులను తీసుకువస్తూనే ఉంది.
అయినా ప్రజా వ్యతిరేకతను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేయించుకుని శాసనమండలికి పంపింది.అయితే అక్కడ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి మండలి చైర్మన్ పంపడంతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది.
జగన్ రాజధానిని విశాఖ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కనిపిస్తుండటంతో ఈ విషయం కోర్టుకు చేరింది.శాసనమండలిలో ఈ అంశం తేలేవరకు ఎటువంటి చర్యలు తరలింపు చర్యలు చేపట్టవద్దు అంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం దూకుడుకు బ్రేక్ పడింది.ఈ సమయంలో రైతులతో చర్చించి వారిని ఒప్పించడం తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం వారితో దశలవారీగా చర్చలు జరిపి వారికి నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగానే ఎంపీ లావు కృష్ణదేవరాయలను రంగంలోకి దింపింది ప్రభుత్వం.
రాజధాని రైతుల వద్దకు కమిటీ ప్రతిపాదనను తీసుకువెళ్లే ఆలోచనతోనే లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కాకుండా శుక్రవారం రాజధానిలోని మండలం వెలగపూడి గ్రామాల్లో అమరావతి కి మద్దతుగా చేపడుతున్న రైతుల వద్దకు వెళ్లి వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం నుంచి త్వరలోనే ఒక కమిటీ మీ దగ్గరికి వస్తుందని, ఆ కమిటీ ముందు మీ డిమాండ్లు చెప్పాలని, మీకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అంటూ ఆయన వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.అయితే ఆయన మాటలను శ్రద్దగా విన్న రైతులు అమరావతి తప్ప ఇక ఏ విషయాన్ని తాము అంగీకరించమంటూ ఆయనకు నిర్మొహమాటంగా చెప్పేశారు.అయినా ప్రభుత్వం మాత్రం రైతుల వద్దకు రాయబారాలు పంపుతూనే, రైతుల్లో చీలిక తెచ్చే దిశగా కొంత మందిని తమ వద్దకు పిలిపించి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అమరావతి జేఏసీ అనుమానిస్తోంది.
అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి తమకు అమరావతి తప్ప ఇక ఏ విషయాన్ని తాము పట్టించుకోమని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.