జగన్ ఎప్పుడు ఎలా ఉంటారు.ఎవరిపై అనుగ్రహం కురిపిస్తారు అనేది ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా అంతుబట్టని విషయమే.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి జగన్ వెంట నడిచిన వారు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా 2019 ఎన్నికల్లో గెలిచారు.జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారు ఇందులో ఉన్నారు.2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ విజయం సాధించడంతో ఇక తమ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి డోకా లేదని, మంత్రులు అయిపోయినట్టే అని చాలా మంది ఊహించుకున్నారు.కానీ జగన్ మాత్రం సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులను కేటాయించారు.
పెద్ద గా జనాలకు పరిచయం లేని నేతలను మంత్రులు గా ఎంపిక చేశారు.
అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు.
ఇది ఒక రకంగా జగన్ కు క్రెడిట్ తీసుకు వచ్చినా, మొదటి నుంచి జగన్ వెంట నడిచిన వారు ఆయనకు అత్యంత సన్నిహితులకు మాత్రం జగన్ మొండిచేయి చూపించారు.వీరిలో కొంతమంది బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొంతమంది రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అయినా తమకు అవకాశం దక్కుతుందని ఎదురు చూపులు చూస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.మంత్రివర్గ విస్తరణ చేపట్టి ప్రస్తుతం ఉన్న మంత్రులలో ముగ్గురు, నలుగురిని తప్పించి మిగతా వారు అందరిని మార్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.
అయితే కొత్త మంత్రివర్గంలో తమకు చోటు ఉంటుంది అని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి పదవులు ఆశిస్తున్నవారి లో ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ఆర్ కే రోజా, ధర్మాన ప్రసాదరావు, తెల్లం బాలరాజు, జోగి రమేష్, ముదునూరు ప్రసాదరాజు, అమర్నాథ్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళితే లిస్ట్ పెద్దగానే ఉంది.వీరే కాకుండా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారు తమ పనితీరు బాగుందని నమ్ముతున్న వారు చాలామంది జగన్ కరుణ కోసం చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అంతా తమకు జగన్ ఛాన్స్ ఇస్తారనే ఆశలు పెట్టుకున్నారు.
ఏదో ఒక సమీకరణలో భాగంగా తమకు అవకాశం వస్తుందనే నమ్మకంతో వారంతా ఉన్నారు.