వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఒక వెలుగు వెలిగిన నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా కు కాలం కలిసి వస్తున్నట్టుగా కనిపించడం లేదు.వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో రోజా ఆ పార్టీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపించారు.
అప్పటి అధికార పార్టీ టిడిపి పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, వైసిపి వాయిస్ బలంగా వినిపించే వారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విషయంలో రోజా ఎప్పుడు ముందుండేవారు.
ఇక నగరి నుంచి రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.దీంతోపాటు వైసీపీ కూడా ఏపీలో అధికారంలోకి రావడంతో రోజాకు మొదటి విడత లోనే ఏపీ కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు.
అయితే జగన్ మాత్రం ఆమెకు మొండిచేయి చూపించారు.దీంతో రోజా జగన్ పై కాస్త అలక చెందారు.
అయితే రోజాకు మంత్రి పదవి బదులుగా ఏపీఐఐసీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్.అయినా రోజాకు మంత్రి అవ్వలేదని బాధ ఎక్కువగా కనిపిస్తోంది.
కానీ రెండో విడత మంత్రి మండలిలో మార్పుచేర్పులు చేసే సమయంలో రోజాకు బెర్త్ కన్ఫార్మ్ అని వార్తలు వస్తున్నాయి.రోజా కూడా మంత్రి అవుతానని బలంగానే నమ్ముతున్నారు.
అయితే అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి.త్వరలో మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ స్థానంలో తనకు అవకాశం దక్కుతుందని రోజా ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు కూడా రోజా ఆశలు తీరేలా కనిపించడం లేదు.దీనికి కారణం కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరికీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండదండలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా కరోనా వైరస్ ప్రభావం ఏపీలో కనిపించిన దగ్గర నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ హడావుడి చేస్తున్నారు.దీంతో ఆమె పేరు మీడియా, సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది.వైసీపీ తరఫున యాక్టివ్ గా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు దగ్గరవుతున్నారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగుతోంది.దీంతో రోజాకు దక్కాల్సిన అవకాశం రజినీకి కానీ, ఉండవల్లి శ్రీదేవి కి గాని దక్కే అవకాశం ఉన్నట్లుగా వైసీపీలో ఉన్న కీలక నాయకుల మధ్య జరుగుతున్న సంభాషణ లను బట్టి అర్థమవుతోంది.