ఏపీ అధికార పార్టీ వైసిపి ఎమ్మెల్యే మురుగు కాలువలో కూర్చుని తన్దైన శైలిలో నిరసన తెలపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక సంచలనంతో వార్తలు లోనే ఉంటూ ఉంటారు.
తాజాగా ఆయన ఓ ప్రజా సమస్యకు సంబంధించిన విషయంపై అధికారుల తీరును నిరసిస్తూ మురుగు కాలువలో కూర్చుని నిరసన తెలిపారు.నెల్లూరు ఉమ్మారెడ్డి గుంటలో చాలా కాలంగా మురుగు కాలువ సమస్య ఉంది.
ఈ మురుగు కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని అనేక రోజుల నుంచి అధికారులను కోరుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ అధికారులను ఈ విషయంపై సంప్రదిస్తే అది తమ పరిధిలోని కాదని, రైల్వే అధికారులు దీనిని నిర్మించాలని వారు చెబుతున్నారు.
ఇక రైల్వే అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు.దీంతో ఈ సమస్యను తీర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు.
ఈయన వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే సమస్యపై అప్పట్లోను నిరసన తెలిపారు.ఇప్పటికి ఈ సమస్య తీరకపోవడంతో ఈ విధంగా మురుగు కాలువలో కూర్చుని వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
తనను ఎన్నుకున్న ప్రజలు ఈ సమస్యపై తన కాలర్ పట్టుకుని నిలదీస్తున్నారని కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు.అధికారులను ఈ సమస్య తీర్చాలని పదేపదే కోరుతున్నా ప్రయోజనం కనిపించకపోవడంతోనే ఈ విధంగా నిరసన తెలిపానని ఆయన చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నా.తనకు ఈ సమస్యపై నిధులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.అయితే చాలాకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు శ్రీధర్ రెడ్డి చేస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం కనీసం డ్రైనేజీ సమస్యలను తీర్చేందుకు నిధులు ఇవ్వడం లేదనే విషయాన్ని హైలెట్ చేసి తనకున్న అసంతృప్తి ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల్లోనే కలుగుతున్నాయి.