వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలని వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది.ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ చేస్తాడంటూ కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.
అయితే వాటిని విశాల్ ఖండించాడు.తనకు ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టే ఆసక్తి లేదంటూ స్పష్టం చేశాడు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు.వైసీపీ తరపున కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది, ఆయనను ఓడించేది ప్రసుత్తం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఒక్కరే ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబును ఓడిస్తే టీడీపీని నిర్వీర్యం చేయవచ్చు అనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం తలమునకలై ఉంది.దీంతో ఎప్పటికప్పుడు టీడీపీ దృష్టి మళ్లించడానికి కొత్త పేర్లను తెరపైకి తెస్తోంది.
అయితే ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.గతంలో రెండు సార్లు కుప్పం నుంచి పోటీ చేసి ఓడి పోయిన దివంగత చంద్రమౌళి కుమారుడే భరత్.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.కుప్పంలో ఆయన ఇప్పటికే గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు.
అయితే ఇంతలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి చంద్రబాబుపై పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.చంద్రబాబు ముందు ఎమ్మెల్సీ భరత్ సరితూగలేడని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.దీంతో మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించిన మాదిరిగా కాకుండా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ భరత్ స్థానంలో ద్వారకనాథరెడ్డిని బరిలోకి నిలిపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల చంద్రబాబు చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించిన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.మినీ మహానాడుకు వస్తున్న టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు.అయితే చంద్రబాబు విమర్శలను ద్వారకనాథ్రెడ్డి ఖండించారు.
మినీ మహానాడు కార్యక్రమానికి వెళ్లకుండా తాము ఎవరినీ అడ్డుకోలేదని పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి స్పష్టం చేశారు.పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడంవల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, చంద్రబాబు రాజీనామా చేసి కుప్పంలో కానీ, తంబళ్లపల్లెలోకానీ తనపై పోటీచేసి గెలవాలంటూ సవాల్ విసిరారు.