మొన్నటి వరకు తమకు ఎటువంటి ఢోకా లేదని ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయం అనే ధీమాలో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ ఎక్కుయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైసీపీ అధిష్ఠానంతో పాటు కిందిస్థాయి నాయకులంతా ధీమాగా ఉన్నారు.
దానికి తగ్గట్టుగానే చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి.మిగతా చోట్ల టిడిపి, వైసిపి, బిజెపి పార్టీలు పోటీలో ఉన్నా వైసిపి హవా కనిపించింది.
కానీ అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదు.ఈ అంశంపై ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వార్ ముదిరి పోయింది.
దీంతో వైసిపి నాయకుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ కొనసాగినా, స్థానికంగా చాలామంది నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైతే కనుక తాము ఏకగ్రీవంగా గెలుచుకున్న సీట్లను కోల్పోవాల్సి ఉంటుందని, వీరంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఎన్నికల ప్రక్రియ ఎక్కడి నుంచి అయితే ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా ఎస్ఈసీ ప్రకటించింది.
అయితే దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే కనుక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందేమోనని, ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుల్లో ఆందోళన కనిపిస్తోంది.అలాగే పుంగనూరు, శ్రీకాళహస్తి లలో ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.అలాగే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి.ఒకవేళ అదే కనుక జరిగితే తిరిగి ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే ఏకగ్రీవం కోసం చాలా ఖర్చు పెట్టామనే ఆందోళన కనిపిస్తోంది.అలాగే ఆరు వారాల పాటు తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను పోషించడం వారిని అన్ని రకాలుగా మెప్పించడం ఆర్థిక భారం అవుతుందని ఏకగ్రీవంగా గెలిచినా వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది.
దీంతో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా మొదలవుతుంది అన్న దానిపై వైసిపి నాయకులు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.వీరికి వైసీపీ అధిష్టానం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నా వారిలో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.