బిజెపి వైసిపి ల మధ్య సంబంధాలు రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నా, కేంద్ర స్థాయిలో మాత్రం రెండు సఖ్యత గానే ఉంటూ వస్తున్నాయి.ఒకరికొకరు సహకరించుకుంటూ, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తూ వస్తున్నాయి ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైసీపీ పై ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీని ప్రధాన శత్రువుగా చూస్తూ ఉండే వారు.
కానీ టిడిపి విషయంలో అనుకూలంగా ఉంటూ, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారు.కానీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆయన వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తూ, తెలుగుదేశం పార్టీని ప్రధాన శత్రువు అనే అభిప్రాయంతోనే ఉంటూ వచ్చారు.అయితే ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు అంతర్వేది వ్యవహారం చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది.
జనసేన బిజెపి రెండు పార్టీలు కలిసి వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, ఈ వ్యవహారాన్ని వేడెక్కిస్తునే వస్తున్నాయి.మొన్నటి వరకు మూడు రాజధానుల వ్యవహారంలోనూ, మరి కొన్ని అంశాల్లోనూ, వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా కేంద్రం వ్యవహరించింది.
కానీ ఇప్పుడు మాత్రం టిడిపి స్థాయిలోనే వైసీపీ పై విమర్శలు చేస్తూ బలపడేందుకు చూస్తుండడంతో, వైసీపీలో ఈ వ్యవహారంపై చర్చ జరగడంతో పాటు, బీజేపీని ఏపీలో బలోపేతం చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బీజేపీ తీరుపై విమర్శలు చేశారు.దేవాలయాలపై దయచేసి రాజకీయాలు చేయవద్దని , ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతోందని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం బీజేపీకి సరికాదంటూ, చురకలు అంటించారు.అక్కడితో ఆగకుండా 2017 అక్టోబర్ లో పశ్చిమగోదావరి జిల్లాలో రధం దగ్ధమైన సంఘటన గుర్తు చేస్తూ, అప్పటి టీడీపీ ప్రభుత్వం తో భాగస్వామ్యం అయిన బీజేపీ ఆ సంఘటనకు సంబంధించి సమాధానం చెప్పాలంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
బిజెపి వైఖరిలో గణనీయమైన మార్పు రావడం తోనే వైసీపీ కూడా ఈ విధంగా బీజేపీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది.ముందు ముందు విమర్శలు మరింతగా పెంచే అవకాశం కనిపిస్తోంది.