వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ అధినేత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించేవిగానే ఉన్నాయి.ఎవరు వద్దన్నా కాదన్నా జగన్ మాత్రం తాను ఏది తీసుకున్నా పార్టీకి, ప్రజలకు ఉపయోగపడేదే అన్నట్టుగా ఎవరి మాటా వినకుండా ముందుకు వెళ్తున్నారు.
అయితే ఇక్కడే తేడా కొట్టేస్తోంది.ప్రత్యర్థి పార్టీలు ఇప్పటి వరకు జగన్ మీద గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే అయితే అదే పరిస్థితి ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి కూడా ఎదురవుతుండడంతో పార్టీ పరిస్థితిపై ఆందోళన రేగుతోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలను పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఎన్నికల వరకు తాము ఎవరిమీద అయితే పోరాటం చేసామో వారినే తిరిగి పార్టీలోకి తీసుకురావడంతో పాటు కీలక పదవులు ఇచ్చేందుకు సిద్ధం అవుతుండడంపై మండిపడుతున్నారు.
తాజాగా జూపూడి ప్రభాకర్ వైసిపిలో చేరటాన్ని కొందరు నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా లో వైసీపీ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తాము ఎవరినైతే వ్యతిరేకించి పోరాటం చేశామో ఇపుడు వారినే పార్టీలోకి తీసుకుంటే తాము చేసిన పోరాటాలకు అర్ధమేంటి అంటూ తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు.గతంలో వైఎస్ కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిని, వ్యక్తిగతంగా వారిపై సోషల్ మీడియాలో విషం చిమ్మిన వారిని పార్టీలోకి చేర్చుకుని తమ అధినేత జగన్ ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.వైసిపిలో ఉన్నంత కాలం జగన్ దగ్గర అన్ని విధాల ప్రాధాన్యత పొందిన తర్వాత కూడా జూపూడి వంటి వారు టిడిపిలో చేరటాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు.
టిడిపిలోకి వెళ్ళగానే జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీలోకి వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వైసిపిలో చేరుతున్న వారి వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేకపోయినా వారిని చేర్చుకోవటంలో అర్ధం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.కొంతకాలం క్రితం అనకాపల్లి ఎంపిగా టిడిపి తరపున పోటి చేసిన అడారి ఆనంద్ కుమార్ కూడా వైసిపిలో చేరారు.ఆయన తండ్రి తులసీరావు మాత్రం టిడిపిలోనే ఉన్నారు.
ప్రస్తుతం జూపూడి వైసిపిలో చేరారు.ఇక చాలామంది టీడీపీ నేతలు వైసీపీలోకి వచ్చేందుకు చూస్తుండడంతో వైసీపీ నాయకుల్లో అభద్రతా భావం పెరిగిపోయినట్టు కనిపిస్తోంది.