వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ట్విస్ట్ లు కొనసాగుతూనే ఉన్నాయి.ఎవరయితే మొదటి నుంచి పార్టీకి , జగన్ కి అండగా ఉంటూ వస్తున్నారో వారందరిని దూరం పెట్టె పనిలో పడ్డాడు జగన్.
వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఖాయం అనుకున్న వారికి ఇప్పుడే ఎమ్యెల్యే సీటు లేకుండా జగన్ చేస్తున్నాడు.పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నవారికే ఇలా ఉంటే ఇక మా పరిస్థితి ఏంటి అని మిగతా నియోజకవర్గ ఇంచార్జిలు ఆందోళన చెందుతున్నారు.
సర్వే రిపోర్ట్ ను సాకుగా చూపించి ఇలా నా అనుకున్న వారిని పక్కన పెట్టేస్తే ఇక జగన్ ని ఎవరు నమ్ముతారు అని పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాలలో కొత్తవారిని రంగంలోకి దించి పార్టీ కేడర్ విమర్శలకు గురైనప్పటికీ జగన్ తన ధోరణి మార్చుకోవడం లేదు.నియోజకవర్గ ఇన్చార్జ్లే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జగన్ ఆలోచనా ధోరణితో వణికిపోతున్నారు.మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు.
పార్టీకి, జగన్కు ఆర్కే తొలి నుంచి వీర విధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు.ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్ను నీడలా వెన్నంటి ఉన్నారు.
ఎక్కడా రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు.రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశంకు, సీఎం చంద్రబాబుకు తరచూ కంట్లో నలుసుగా మారి కోర్టు కేసుల ఆర్కేగా పేరుగడించారు.
అటువంటి నాయకుడికి కూడా ఇప్పుడు జగన్ టికెట్ లేదని చెప్పెయ్యడంతో పార్టీ నాయకులంతా గుర్రుగా ఉన్నారు.
ఇక మిగతా నియోజకవరాగాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ శ్రీదేవి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కత్తెర క్రిస్టినాపై వేటు వేసేందుకు జగన్ సిద్ధం అయ్యాడు.
ఇక వేమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మేరుగ నాగార్జునకు కూడా ఈ సారి సీటు కష్టమేనని అంటున్నారు.