ఏపీలో ముందస్తు ఎన్నికల విషయం హాట్ టాపిక్గా మారింది.సాధారణంగా ఎక్కడైనా విపక్షాలు ముందస్తు ఎన్నికలను కోరుకుంటాయి.
కానీ ఏపీలో విచిత్రంగా అధికార పార్టీ ఎన్నికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది.ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రను వైసీపీ చేపట్టింది.
అంతేకాకుండా వరుసపెట్టి జగన్ జిల్లా సభలకు హాజరవుతూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.
ఇదంతా చూసి అధికార పార్టీ వైసీపీ ముందస్తు ఎన్నికలకే సిద్ధమవుతోందని అందరూ భావిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 2023 లేదా 2024లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.అయితే ముందస్తు ఎన్నికల విషయంలో వైసీపీ డైలమాలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజాగా మంత్రి పేర్ని నాని షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2024లోనే జరుగుతాయని వివరించారు.
అయితే ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే.ఐదేళ్ల పాటు ప్రజలు 151 సీట్లు ఇచ్చి అందలం ఎక్కించిన తర్వాత ఏ పార్టీ అయినా ముందస్తు ఎన్నికలను కోరుకుంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.కానీ ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పుడు అధికార పార్టీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా కార్యక్రమాలను చేపడుతుండటమే సందేహంగా మారింది.
అయితే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రాజకీయ కారణాలే కాదు ఆర్ధిక కారణాలు ఉన్నాయని రాజకీయ పండితులు వివరిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
మరో రెండేళ్ల పాటు అప్పులతో ప్రభుత్వాన్ని నడపడం కష్టమని భావించే ఎంత వీలైతే అంత ముందుగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.గెలుపుపై ధీమా ఉంటే ముందస్తుకు వెళ్తారు.
లేదా ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తే మిగతా రెండేళ్లను కూడా గడిపేసిన తర్వాతే తీరిగ్గా ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది.మొత్తానికి ముందస్తుపై వైసీపీ అధినేత జగన్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.