టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్రపడిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయనకున్న బ్యాంకు అప్పులు, ఇతర ఆర్ధిక వ్యవహారాలు కారణంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసింది.
బీజేపీలో ఉంటే తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, రాజకీయంగా బిజెపి తనకు అండగా ఉంటుందని సుజనాచౌదరి భావించి బిజెపి లోకి వెళ్లారు.మొదట్లో బిజెపిలో ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ కల్పించారు.
ఈ మేరకు ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతూ జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే ప్రస్తుతం వైసిపి, బిజెపి అనధికారికంగా పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ సుజనకు ప్రాధాన్యం తగ్గించినట్టు కనిపిస్తోంది.
కొద్దిరోజుల క్రితమే ఆయనకి బ్యాంకు నోటీసులు ఇవ్వడం, ఆయన బ్యాంకు దగ్గర తీసుకున్న అప్పు చెల్లించకపోతే అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నట్టు గా సంకేతాలు ఇవ్వడం చర్చగా మారింది.ప్రస్తుతం సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.అయితే ఆయనకు రాజకీయంగా క్షేత్రస్థాయిలో బలం లేదన్న సంగతి బిజెపికి కూడా తెలుసు.
ఆయన సొంతంగా పోటీ చేసేందుకు నియోజకవర్గం కూడా లేదు.దీంతో ఆయన వల్ల పెద్దగా ఉపయోగం లేదనట్లుగా బిజెపి భావిస్తోంది.
రాజ్యసభ సభ్యుల మద్దతు బీజేపీ కి అవసరమైన వైసీపీకి అదనంగా నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కనున్న నేపథ్యంలో వైసీపీ మద్దతు తమకు ఎలాగూ ఉంటుంది అనుకుంటున్న బిజెపి ఆయన వ్యవహారంలో పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.దీనికి నిదర్శనం గానే, ఇప్పుడు బ్యాంకులు ఆయనపై ఒత్తిడి చేస్తున్న తీరును బట్టి అర్థమవుతోంది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మీద ఆర్బీఐ కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.సుజనా వ్యవహారంలో బ్యాంక్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని , సుజనా వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు కేంద్ర పెద్దలు కూడా సుజనా వ్యవహారాన్ని పట్టించుకునే విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు.దీంతో ఇప్పటికే ఐటి, ఈడీ శాఖలు పూర్తిగా సుజనా మీద దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఆర్థిక వ్యవహారాల్లో అనేక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆధారాలు బయటపడినట్టు తేలడంతో తొందర్లోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.