గత తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమ ఇసుక ద్వారా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కోట్లాది రూపాయలు వెనకేసుకుని ప్రజాధనం లూటీ చేశారని వైసీపీ ఎన్నికల ముందు పదేపదే ఆరోపణలకు దిగింది.తెలుగుదేశం పార్టీని అప్పట్లో ఇసుక మాఫియా అంశం చాలా ఇబ్బంది పెట్టగా వైసీపీకి అది బూస్ట్ లా పనిచేసింది.
ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇసుక పాలసీని తీసుకు వచ్చే ఉద్దేశంతో ఇసుక తవ్వకాలను అడ్డుకుంది.ఎవరికి ఇసుక కావాలన్నా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే వారికి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఇసుకను సప్లై చేసే విధంగా జగన్ కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చాడు.
ఈ విధానం అమలులోకి వస్తుందనుకున్న ఆ సమయంలో రాష్ట్రంలో భారీగా వర్షాలు, వరదలు రావడంతో ఇసుక తవ్వకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇసుక కొరతతో భవన నిర్మాణాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ విషయంలో వైసీపీ సమాధానం చెప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఇదే సమయంలో అధికార పార్టీని ఇబ్బందులు గురిచేసేలా ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగాయి.
నవంబర్ 3వ తేదీన ఇసుకపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో భావన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నాడు.ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించుకున్నాడు.
ఇక టిడిపి ఈ అంశాన్ని వాడుకునేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.తాజాగా గుంటూరు జిల్లాలో వెంకటేష్ అనే భవన నిర్మాణ కార్మికుడు సెల్ఫీ వీడియో తీసి మరి ఆత్మహత్యకు పాల్పడడంతో ఎక్కడ లేని రచ్చ చెలరేగింది.
దీంతో వైసిపి ప్రత్యర్థి పార్టీలకు మరో ఆయుధం దొరికినట్టు అయ్యింది.ఈ నేపథ్యంలో వైసీపీ ప్రత్యర్థి పార్టీలన్నీ ఇసుక వివాదాన్నే రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకునేందుకు సిద్దమయ్యాయి.జనసేన నిరసన కార్యక్రమాలకు ఇప్పటికే వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి.విశాఖలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి చేయబోయే నిరసన కార్యక్రమానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.
ఈ నేపథ్యంలో బిజెపి, టిడిపిలు ఆ నిరసన కార్యక్రమానికి మద్దతు పలికే విషయంలో ఆలోచనలో పడ్డాయి.
ఇలా రోజురోజుకు నిరసన కార్యక్రమాలు పెరుగుతుండడంతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.దీంతో పాటే విపక్షాల ఆందోళనలు కూడా ఉధృతమవుతున్నాయి.దీంతో ప్రభుత్వం ఎప్పుడూ లేని స్ధాయిలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.
ఈ ఏడాది చివరి నాటికి కానీ ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో అప్పటివరకు వైసీపీ ఇలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.
.