ఆంధ్ర తెలంగాణ విభజన కారణంగా ఏపీకి తీరని నష్టం జరిగిందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోలేదనే అభిప్రాయం ప్రజల్లో బాగా ఉండేది.టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడంతో టిడిపి దానికి అంగీకారం తెలిపింది.
అయితే ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం పక్కనపెట్టేసింది.అయితే అప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది.
ఢిల్లీకి వెళ్లి మరి వైసిపి పోరాటం చేసింది.ఇక 2019 ఎన్నికల సమయంలోనూ ప్రత్యేక హోదా అంశం పైనే వైసిపి పోరాడింది.ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఈ అంశాన్ని పక్కన పెట్టేసి నట్టుగా కనిపించింది.దీనికి కారణం బీజేపీ తో సన్నిహితంగా మెలగడమే కారణం.
మళ్లీ కొద్దిరోజులుగా ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో వైసిపి ప్రస్తావించింది.తాజాగా ఏపీ తెలంగాణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
నిన్న ఉదయమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నట్లు గా కేంద్రం సంకేతాలిచ్చింది అని , వైసీపీ నేతలు అంతా హడావుడి చేశారు.మీడియా సమావేశాలు నిర్వహించి ఇదంతా వైసీపీ క్రెడిట్ అంటూ గొప్పగా చెప్పుకుంది.
దీంతో నిజంగానే ప్రత్యేక హోదా ను కేంద్రం ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు కానీ సాయంత్రానికి కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రత్యేక హోదా అంశం ఎక్కడ కనిపించలేదు.
నిన్న ఉదయం తొమ్మిది అంశాలపై చర్చ ఉంటుందని చెప్పాక సాయంత్రానికి కేవలం ఐదు అంశాలపై మాత్రమే చర్చ ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపే ఉద్దేశంతోనే త్రిసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.కేంద్రమే పరిష్కరించాల్సిన ప్రత్యేక హోదా , అదనపు నిధులకు సంబంధించిన అంశాలు లేకపోవడం వైసీపీని నిరాశపరిచింది.
దీంతో నిన్న ఉదయం నుంచి వైసీపీ నేతలు క్రెడిట్ తమదే అన్నట్లుగా ఆర్భాటం చేశారు.సాయంత్రానికి సీన్ రివర్స్ కావడంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు.
కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా పై ప్రకటన చేసి ఉంటే వైసీపీకి మరింత క్రెడిట్ వచ్చేది కానీ అవకాశమే లేకుండా పోవడంతో ఈ అంశంపై కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయలేక, రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసీపీ పరువు పోగొట్టుకున్నట్టు అయింది.