ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తం అవుతోంది.మారు మూల పల్లెటూరు నుంచి సిటీ జనాల వరకు ఇదే చర్చ నడుస్తోంది.
ఏ పార్టీ అధికారం చేపడుతుంది, ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి ? ఎక్కడెక్కడ మెజార్టీ ఎంత వస్తుంది అనే విషయాల మీద చర్చ నడుస్తోంది.ఒక పక్క చూస్తే ఏపీలో అధికారం తమదే అంటూ వైసీపీ ధీమాగా చెప్తోంది.
అక్కడితో సరిపెట్టకుండా మంత్రి వర్గ ఏర్పాటు మీద కూడా కసరత్తు చేస్తోంది.కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలి ? కేంద్ర మంత్రి పదవులు తీసుకుందామా వద్దా అనే లెక్కలు కూడా వేసుకుంటూ హడావుడి చేస్తుంటే టీడీపీ కూడా తామేమన్న తక్కువ తిన్నామా అంటూ తాము కూడా అధికారంలోకి వస్తాం అని చెప్తోంది.అంతే కాదు తమ పార్టీకి 130 నుంచి 150 సీట్లు వస్తాయంటూ లెక్కలు కూడా చెప్తోంది.
కానీ ఇదే సమయంలో ఈవీఎం లలో అక్రమాలు జరిగాయని, కేంద్రం కావాలని కుట్ర చేస్తోంది అంటూ హడావుడి చేయడంతో ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో కలుగుతోంది.
దీనికి తోడు అనేక సర్వేల్లోనూ వైసీపీ విజయం ఖాయం అన్న సంకేతాలు అందుతుండడం టీడీపీకి మింగుడుపడడంలేదు.ఇక అధికారులకైతే వైసీపీ విజయం మీద పూర్తి నమ్మకం పెరిగిపోయింది.
ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందనే నమ్మకం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.జగన్ ముఖ్యమంత్రి అవుతారని వారు నమ్ముతున్నారంట.అందుకే వైసీపీ కీలక నాయకులతో కొంతమంది కీలక అధికారులు టచ్ లోకి వెళ్లినట్టు కూడా సమాచారం అందుతోంది.
రెండు మూడు రోజుల క్రితం మళ్లీ ఐఏఎస్ అధికారులు తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించేందుకు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఐఏఎస్ లు పెద్ద సంఖ్యలోనే వచ్చారు.ముఖ్యమంత్రి గతంలో సీఎస్ ఎల్వీ మీద చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.
ఇకపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పూర్తి మద్దతుగా ఉండాలని, ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు.ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి, మంత్రుల సమీక్షలు, పర్యటనలకు కూడా హాజరుకావడం కాకపోవడం టీడీపీలో కలవరం మరింత పెంచుతోంది.
ఇక డెప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లిన పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా మళ్లీ రాష్ట్రానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారట.ఈ పరిణామాలన్నీ వైసీపీలో జోష్ పెంచుతున్నాయి.