ఏపీలో వైసీపీ, బీజేపీలు ఇప్పుడు కత్తులు నూరుకుంటున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఎవరికివారు పోటీపడుతున్నారు.
ఏపీలో బలపడాలని 2024 నాటికి అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో బీజేపీ చక చకా రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది.మొదట్లో తెలుగుదేశం పార్టీని పోటీగా భావించి ఆ పార్టీని మరింత బలహీనం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూసినా, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ని ఇబ్బంది పెట్టకపోతే తమకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది అంచనాకు ఆ పార్టీ వచ్చేసింది.
దీంతో కొంత కాలంగా బీజేపీ ఏపీలో హడావుడి ఎక్కువగా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కానీ కేంద్రంలో పరిస్థితి మాత్రం పూర్తిగా వేరేగా ఉంది.
ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటి దూరమవుతున్న తీరుతో బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది.దీనికి తోడు రాజ్యసభలో పెద్దగా బలం లేకపోవడంతో, ఏదైనా ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అనేక ఇబ్బందులు పడుతోంది.
అటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కి అండగా నిలబడుతూ, ఓటింగ్ లో తగిన సహకారం అందిస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.
ఇక జగన్ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని కలవబోతుండడంతో ఎన్డీఏలో చేరేందుకే జగన్ ఢిల్లీ టూర్ అనే ప్రచారం మొదలైంది.
నిజంగా జగన్ ఎన్డీయేలో చేరి మంత్రి పదవులు తీసుకుంటే విజయ్ సాయి రెడ్డి మరో ఎంపీకి కేబినెట్ లో మంత్రులుగా అవకాశం దొరికే ఛాన్స్ లేకపోలేదు.వైసిపి ఎన్డీఏ లో చేరితే ఏపీకి సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి, నిధుల కొరత పెద్దగా ఉండదు.కేంద్రం అన్ని రకాలుగానూ సహాయం అందించడంతో పాటు, ఏపీలో తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసే విషయంలో గాని, ఆ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే విషయంలోనూ ఏపీ అధికార పార్టీకి వైసీపీకి అన్ని రకాలుగానూ బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే చంద్రబాబు లోకేష్ తో పాటు, మరికొంతమంది టీడీపీ నాయకుల అవినీతి వ్యవహారాలకు సంబంచిన అన్ని ఆధారాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్లుగా, సరైన సందర్భంలో వాటిని బయట పెట్టి రాజకీయంగా, వ్యక్తిగతంగా వారికి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఈ సమయంలో కేంద్ర క్యాబినెట్ లో వైసీపీ చేరితే టీడీపీ మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనే విధంగా పరిస్థితులు ఉన్నాయి.